కొత్త ప్రభుత్వం ఏర్పడి పది రోజులు మాత్రమే అవుతుందని... అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని.. కవ్వింపు చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో శాంతి వాతావరణం ఉండాలన్నారు. నల్గొండ జిల్లాలో సూర్య నాయక్ లాకప్ డెత్ పై ఉన్నతాధికారిచే సమగ్ర దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డీజీపీని కలిసి విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో డీజీపీ కార్యాలంయంలో కలిసి వినతి పత్రం అందించారు.
సూర్యనాయక్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకొని...ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. అన్నదమ్ముల పంచాయితీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజనుడి మృతికి కారణం అయ్యారని బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, బాల్క సుమన్, దాసోజు శ్రావణ్ కుమార్ ఆరోపించారు. మృతుడి కుటంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్న నేతలు.. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ దారి తప్పుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.