ఓయో రూములు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని కొన్నాళ్లుగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ సమావేశాల్లోనూ ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. పలువురు కార్పొరేటర్లు ఓయో రూములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలోనూ సభలో ఈ అంశంపై గందరగోళం నెలకొంది. పారిశుద్ధ్య నిర్వహణ, ఓయో వ్యాపారం, ఆస్తి పన్ను వసూళ్లు, క్రీడా మైదానాల నిర్వహణలో అక్రమాలు తదితర అంశాలపై పై కార్పొరేటర్లు అధికారులను నిలదీశారు.
ప్రత్యేకించి ఓయో రూముల్లో వ్యభిచారం జరుగుతోందని.. రెసిడెన్షియల్ పర్పస్గా తీసుకుని కమర్షియల్గా వాడుతున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. దీనిపై స్పందించిన అధికారులు చట్ట ప్రకారమే ఆస్తి పన్ను వసూలు చేస్తున్నామని, సెల్లార్లలో అక్రమ వ్యాపారలతో పాటు ఓయో వ్యాపారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనార్డ్ రాస్ ఈ అంశంపై వివరణ ఇచ్చారు.