ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి హైదరాబాద్ నగరానికి చెందిన యువతి నుంచి సైబర్ నేరగాళ్లు లక్ష 34 వేల రూపాయలు కాజేశారు. బాధితురాలు హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేసింది. ముందుగా తనను వాట్సాప్ గ్రూప్లో ఆడ్ చేసి, ఉద్యోగం ఆఫర్ చేశారని అందుకు 30 వేలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే అందులో 20 వేలు చెల్లించేందుకు ఒప్పందం జరిగిన తర్వాత వాటిని చెల్లించింది. అయినా జాయినింగ్ లెటర్ ఇవ్వకుండా నెలలు గడిచిపోవడంతో యువతి వాళ్లని నిలదీసింది. ముందుగా ఇచ్చిన డబ్బులు కాకుండా మరిన్ని డబ్బులు నిందితులు డిమాండ్ చేశారు.
ఉద్యోగంపై ఆశతో వాటిని సైతం క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించింది. అలా పలు దఫాల్లో లక్ష 34వేల 488 రూపాయలు మోసపోయింది. 4 నెలల నుంచి ఉద్యోగ నియామక పత్రం కోసం ఎదురుచూసి ఎంతకీ ఇవ్వకపోతుండడంతో మోసపోయినట్లు గ్రహించింది. పోలీసులను ఆశ్రయించింది.