విశాఖ జిల్లా పెందుర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. యువత మార్పు కోరుకుంటే తప్ప ఏదీ జరగదన్నారు. రాష్ట్రంలో దాదాపు 23 లక్షల మంది యువత గంజాయికి బానిసైందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని గంజాయి రవాణాలో తొలి స్థానంలో పెట్టారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పోర్టులో వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయని... ఉపాధి అవకాశాలు కల్పించలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. 450 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి, ఉద్యోగుల తాలూకా గ్రాట్యుటీ ఫండ్ దోచేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
ఇన్ని చేసి.. మళ్లీ ఇప్పుడు ఓట్ల కోసం వస్తే.. గెట్ లాస్ట్ జగన్ అనాలని.. చెత్త పన్నేసిన ప్రభుత్వాన్ని చెత్తలో పడేయాలని పవన్ పిలుపు నిచ్చారు.ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని జగన్ అడిగితే ఇచ్చిన ప్రజలు సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా దోచేశారో చూశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈసారి మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండి....మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్ తీసుకోండంటూ ప్రజలకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, పెందుర్తి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన వారాహి విజయభేరి సభల్లో పవన్ ప్రసంగించారు.