ఆ వ్యాధి పగవాడికికూడా రాకూడదు.. ఆదుకోండి.. అర్థించిన భువనేశ్వరి?
బాధితులకు తప్ప ప్రపంచానికి పెద్దగా తెలియని వ్యాధి తలసీమియా.. ఆ వ్యాధి బారినపడిన చిన్నారులకు అండగా నిలబడాలనే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇంత పెద్దఎత్తున వచ్చి మద్దతు ఇవ్వడం ఆనందం కలిగిస్తోందన్న నారా భువనేశ్వరి.. యుపోరియా మ్యూజికల్ నైట్ ప్రధాన ఉద్దేశం.. తలసీమియా చిన్నారులకు భరోసా ఇవ్వడమే అన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా.. ఒక పౌరుడిగా టికెట్ కొన్ని ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన నారా భువనేశ్వరి.. తలసీమియా చిన్నారులు ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు.. వారికి రక్త మార్పిడి తప్పనిసరి.. రక్తదానం అంటే ప్రాణదానమే. యువత రక్తదాతలుగా మారాలి. వారి కుటుంబాలు, స్నేహితులతో దానం చేయించాలి. అదే మరొకరికి ప్రాణదానమవుతుందని సూచించారు.
వారిని కలిసి, కష్టాలను చూసి.. ఆ చిన్నారుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఏం చేయగలదనే ఆలోచించే.. తలసీమియా కేర్ సెంటర్లు పెట్టాలని నిర్ణయించుకున్నామన్న నారా భువనేశ్వరి.. ఒక్కో సెంటర్ ఏర్పాటుకు రూ.40 నుంచి రూ.50లక్షల ఖర్చవుతోందన్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వచ్చే డబ్బులతో మరిన్ని సెంటర్లను ఏర్పాటు చేస్తామని నారా భువనేశ్వరి తెలిపారు.