మోదీ ప్రధానమంత్రి అయ్యాక దేశవ్యాప్తంగా ఉన్న రు.1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా రూ.2వేల నోటును తీసుకురావటం తెలిసిందే. పెద్దనోట్ల రద్దులో భాగంగా రూ.వెయ్యి.. రూ.500 నోట్లు చెల్లవని చెప్పిన మోడీ సర్కార్... రు.1000 నోటుకు శాశ్వతంగా మంగళం పాడేసింది. ఆ తర్వాత నగదు సర్దుబాటు చర్యల్లో భాగంగా రు.1000 నోటకు బదులుగా రూ.2వేల నోటును తర్వాతి కాలంలో రూ.200 నోటును తీసుకొచ్చారే తప్పించి వెయ్యి నోటును తిరిగి తీసుకురాలేదు.
ఇక కొద్ది రోజులుగా కొత్త వెయ్యి నోటును తిరిగి తీసుకు వస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ అవుతోంది. ఒక వెయ్యి నోటు ఫొటోను కూడా హల్చల్ చేయిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో రు.2 వేల నోట్లు ముద్రణ ఆపేసిన క్రమంలోనే ఏ క్షణంలో అయినా ఈ నోటును రద్దు చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే మళ్లీ తిరిగి రు. వెయ్యి నోటును తీసుకు వస్తారని అంటున్నారు. ఈ ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండడంతో చివరకు రిజర్వ్ బ్యాంక్ క్లారిటీ ఇవ్వక తప్పలేదు. ఇలాంటివన్నీ ఉత్తుత్తి ప్రచారాలుగా తేల్చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తాజాగా వెయ్యి నోటు మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
వైరల్ అవుతున్న వెయ్యి నోటు ఫేక్ అని తేల్చేయటమే కాదు.. వెయ్యి నోటును ముద్రిస్తున్న వైనం కూడా తప్పేనని స్పష్టం చేసింది. వెయ్యి నోటును తిరిగి తీసుకొచ్చే ఆలోచన ఇప్పటివరకూ ఏమీ లేదని తేల్చేసింది.