`దిశ` ఎన్కౌంటర్కు రెండేళ్లు..
`దిశ` కేసులో చెన్నకేశవులు, మహమ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివలను అరెస్ట్ చేసిన పోలీసులు.. విచారణలో భాగంగా సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. 2019 డిసెంబర్ 6వ తేదిన చటాన్పల్లి బ్రిడ్జి దగ్గరకు ఈ నలుగురు నిందితులను తీసుకెళ్లారు. అవకాశం దొరికిందనుకున్న వాళ్లు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాళ్లను పట్టుకునేందుకు చూడగా పోలీసులపై రాళ్లు రువ్వారు.. దీంతో తప్పని పరిస్థితుల్లో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. ఈ ఎన్ కౌంటర్తో దేశ వ్యాప్తంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
`దిశ` ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులకు ప్రజలు దేవుళ్ల వలే చూశారు. కానీ.. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ ప్రజా సంఘాలు ఆందోళనలు చేశాయి. ఈ పరిణామాలతో ఎన్కౌంటర్పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు త్రిసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. అయితే.. నిందితుల తరఫున విచారణ చేయడం ఏంటని, వారి తరఫున ప్రజా సంఘాలు ఆందోళన చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన చెపట్టారు. దీంతో ఎన్కౌంటర్ కాబడిన నలుగురి కుటుంబాలకు పోలీసులు భద్రత కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగిస్తూనే ఉంది.