పులస పులుసు మరింత టేస్ట్ గా!
కావలసిన పదార్థాలు: పులస చేప ఒక కేజీ, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, పచ్చి మిర్చి అయిదు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింత పండు గుజ్జు అర కప్పు, టమాటా గుజ్జు ఒక కప్పు, కరివేపాకు రెండు రెమ్మలు, ధనియాల పొడి రెండు స్పూన్లు, మెంతి పొడి పావు టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, జీల కర్ర అర టీ స్పూన్, కారం ఒక టీ స్పూన్, నూనె తగింత, పసుపు పావు టీ స్పూన్, కొత్తిమీర తరుగు మూడు టీ స్పూన్లు.
తయారు చేసే విధానం: పులస చేప ముక్కలను కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పెద్ద కళాయి పెట్టి అందులో నూనె వేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక అందులో టమాటా గుజ్జు వేసి కలపాలి. అందులో చింత పండు పులుసు, కారం, పసుపు కూడా వేసి బాగా వేయించాలి. అందులో రెండు కప్పుల నీళ్ళు పోసి మూత పెట్టాలి. పది నిమిషాల తరువాత అందులో చేప ముక్కలు వేసి సన్నని మంటపై ఉడికించుకోవాలి. తరువాత ధనియాల పొడి, కరివేపాకు, మెంతి పొడి, కారం వేసి ఓ సారి ఉడికించుకోవాలి. ఓ 20 నిమిషాలు ఉడికిన తరువాత పులుసు చిక్కగా అయ్యాక కొత్తిమీర చల్లి దించాలి. అంతే పులస పులుసు రెడీ.