ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని కేయూ విద్యార్థి ఆత్మహత్య...
పురుగులమందు తాగాకా సునీల్ ఈ విధంగా సెల్ఫీ వీడియోలో “నా పేరు బోడ సునీల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు అవుతుంది..ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు. ఎలాంటి జాబులు లేవు. నేను చేతకాక చనిపోవడం లేదు …ఈ రాష్ట్రంలో అందరికీ జాబు లో రావాలంటే నేను చావడమే కరెక్ట్. నా చావు చూసైనా కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలి. నిరుద్యోగుల్లారా కేసీఆర్ను వదలకండి.. నాచావుకు ఆయనే కారణం” అంటూ పేర్కొన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సినోడిని ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. విద్యార్ధులు ముఖ్యమంత్రిని విడిచిపెట్టొద్దని చెప్పాడు. తెలంగాణ వచ్చి ఏడేళ్లైనా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారని... వారి సమస్యలను ప్రభుత్వానికి తెలియచేసేందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. బోడా సునీల్ మరణంతో విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన సునీల్ చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. 2016లో ఎస్సై పరీక్షలు రాసి క్వాలిఫై కూడా అయ్యాడు. అయితే ఫిజికల్ టెస్టులో హైట్ తక్కువగా ఉన్న కారణంగా ఉద్యోగంలోకి తీసుకోలేదు. అప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి... విసిగిపోయిన సునీల్ ఆత్మహత్య చేసుకున్నాడు.