చిట్టీల వ్యాపారి కుచ్చు టోపి.. రూ.10 కోట్లు పాయే..
చిట్టీలతో తమ భవిష్యత్తును ఎంతో కొంత మార్చుకుందామని చూసిన సామాన్యుల ఆశలు ఆవిరయ్యాయి. వారిని పట్టించుకునే వారు లేక ఎంత బాధలు పడ్డారో గతంలోని కొన్ని సంఘటనల ఆధారంగా మనకు తెలుస్తోంది. ఇదే తీరులో తాజాగా చిత్తూరు జిల్లా నగరిలో ఓ చిట్టీల వ్యాపారి ప్రజలను చీట్ చేసి దాదాపు జంప్ అయ్యాడు. దీంతో చాలా మందిలో ఆందోళన పెరిగింది. దాదాపు రూ.10 కోట్ల వరకు చీటీలు నిర్వహిస్తున్న అరుణ్కుమార్ ఇటీవల మాయం అయిపోయాడు. దీంతో అతని దగ్గర చిట్టీలు వేసిన వారు పోలీసులను ఆశ్రయించారు. ఈయన దగ్గర చిట్టీలు వేసింది ఎక్కువగా పేదవారే, లక్ష నుంచి 10 లక్షల వరకు చిట్టీలు కట్టారు. బాధితుల్లో చాలామంది ఏకాంబర కుప్పంకు చెందిన నేత కార్మికులు.
అరుణ్కుమార్ కొద్ది రోజులుగా కరోనా సాకు చూసి డబ్బులు చెల్లించకుండా దాటుకుంటూ వచ్చారు. ఇదే క్రమంలో తన భార్య పిల్లలను ఇంట్లో వదిలి మాయం అయిపోయాడు. విషయం తెలుసుకున్న బాధితులు నగరి సీఐ మద్దయ్య చారికి ఫిర్యాదు చేశారు. అరుణ్కుమార్ కనిపించకపోయే సరికి ఆయన దగ్గర చిట్టీలు వేసిన దాదాపు 200 మంది ఆందోళన చెందుతున్నారు. బాధితులు మాత్రం ఏలాగైన తమకు తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు. తమ పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం చిట్టీలు వేశామని ఇలా మోసం జరుగుతుందని ఊహించలేదని బాధితులు లబోదిబోమంటున్నారు.
అయితే, చిట్టీల విషయంలో గతంలోనే అనేక సార్లు పోలీసులు, ప్రభుత్వాలు, న్యాయ నిపుణులు అనేక సూచనలతో పాటు హెచ్చరికలు కూడా చేశారు. చిట్టీలు వేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నమ్మకం లేని వారి దగ్గర అవసరమయితే చిట్టీలు వేయద్దని సూచించారు. ఏది ఏమైనా ప్రజలు చిట్టీలు వేసి మాయగాళ్ల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ఇప్పటికైనా తగిన ముందు జాగ్రత్తలు తీసుకొని ముందుచూపుతో వ్యవహరించాలని పలువురు సూచిస్తున్నారు.