రోజురోజుకు ఆడవారిపై దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి.. భర్త వేధింపులు, బయటికి వెళ్తే మానవ మృగాలు, ఇంట్లో అత్తింటి వారితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహిళలు. ఇలా తన కోడలు అపరిచిత వ్యక్తితో మాట్లాడడాన్ని చూసి ఓర్వలేక ఆ మహిళను చెట్టుకు కట్టేసి మరీ చితక్కొట్టారు. ఇంటిల్లి పాదీ విచక్షణ రహితంగా చావబాదుతూ చిత్రహింసలు పెట్టారు. ఎంత వేడుకున్నా వారి బండ మనసు కరగలేదు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంపూర్లోని బిలాస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 17 న ఈ దారుణం జరిగింది.
మహిళను చెట్టుకు కట్టేసి బావబాదుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన అపరిచితుడు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు. చెట్టుకు వేలాడతున్న మహిళను అత్తమామలు, కుటుంబ సభ్యులు విచక్షణ రహితంగా కొడుతుండడం ఆ వీడియోలో కనిపిస్తోంది. బాధతో విలవిల్లాడుతూ రోధిస్తున్న బాధిత మహిళ క్షమించి తనను విడిచిపెట్టాలని వేడుకుంటున్నా వారు దాడి చేస్తూనే ఉండడం బాధకలిగిస్తోంది. ఆమె మాట్లాడినట్టుగా చెబుతున్న ‘అపరిచితుడి’ ఫిర్యాదుతో మొత్తం 19 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ఆధారంగా.. బిలాస్పూర్కు వస్తున్న అపరిచిత వ్యక్తి దారిమధ్యలో బాధితురాలిని చూసి మాట్లాడడం మొదలు పెట్టాడు. వీరు మాట్లాడుతుండడం ఓ స్థానికుడు మహిళ అత్తమామలకు ఈ విషయాన్ని చెప్పాడు. వారు రావడం చూసిన అపరిచిత వ్యక్తి భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ఆమెను లాక్కొచ్చి చెట్టుకు కట్టేసి దాడి చేశారు.
అపరిచితుడిది ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్ గ్రామం. రాంపూర్లో అతడికి ఆస్తులు ఉండడంతో వాటిని చూసి వెళ్లేందుకు వచ్చిన క్రమంలో దారి మధ్యలో తెలిసిన వ్యక్తి కావడంతో మహిళ మాట్లాడింది. ఇది చూసిన అత్తమామలు, కుటుంబ సభ్యులు మహిళను లాక్కొచ్చి చెట్టుకు కట్టేసి ఇష్టానుసారం దాడికి పాల్పడ్డారు. వీరి మధ్య వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు ఆమె బంధువులు.