తిరుపతిలో దైవదర్శనం చేయిస్తానని చెప్పి.. చివరికి?
తిరుపతిలో దైవదర్శనానికి టికెట్ బుక్ చేస్తానని.. అలాగే వసతి సౌకర్యం కూడా కల్పిస్తాను అంటూ మాయ మాటలు చెప్పిన కేటుగాడు.. చివరికి మోసం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. జియా గూడా మహంకాళి వీధి ప్రాంతానికి చెందిన దినేష్ కుమార్ ప్రైవేట్ ఉద్యోగి. అయితే ఇటీవల తిరుపతిలో సుప్రభాత సేవ దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయని.. ఒక్కో టికెట్ 2500 మాత్రమే అని వాట్సప్ లో ఒక సందేశం వచ్చింది. దీంతో ఐదు టికెట్లకు రూ. 12000 అవుతాయని భావించి ఇక ఇలా వాట్సాప్ సందేశం పంపించిన నెంబర్ కు ఫోన్ పే చేశాడు దినేష్ కుమార్.
అయితే వసతి సదుపాయం కోసం మరో నాలుగు వేలు చెల్లించాలని సందేశం రావడంతో ఆనగదును కూడా పంపించాడు. ఇక ఆ తర్వాత మరిన్ని మాయమాటలు చెప్పి మరో 10 వేల రూపాయలను పంపమని చెప్పడంతో దినేష్ గుడ్డిగా నమ్మి ఆ డబ్బులు కూడా పంపాడు. అలా మొత్తంగా 26,000 వరకు చెల్లించాడు. తర్వాత నుంచి ఆయనకు వచ్చిన సందేశాలు ఆగిపోయాయి. ఆ నెంబర్కు ఫోన్ చేసిన స్పందన లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.