కాంగ్రెస్ 6 గ్యారెంటీలు సరే.. ఏడో గ్యారంటీ ఇస్తారా?

Chakravarthi Kalyan
తెలంగాణ శాసనసభ ప్రచార గడువు రెండు వారాలకు మించి లేదు. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. తమ పథకాలను వివరిస్తూనే ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తున్నాయి. బీఆర్ఎస్ అప్పుడు ఎట్లా ఉండే తెలంగాణ ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ నినాదంతో ముందుకు వెళ్తుంటే.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను నమ్ముకుంది. మరోవైపు బీజేపీ మాత్రం బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలను తీసుకొని ప్రచారాన్ని కొనసాగిస్తోంది. కాంగ్రెస్ , బీఆర్ఎస్ లు ఒకరినొకరు లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు తప్ప బీజేపీని ఎవరూ పట్టించుకోవడం లేదు.


బీజేపీ మాత్రం రెండు పార్టీలపై విమర్శలు సంధిస్తూనే ఉంది. అందులో భాగంగా బండి సంజయ్ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు కాదు..పార్టీ నుంచి గెలిచిన తర్వాత అమ్ముడుపోరనే ఏడో గ్యారంటీ ఇవ్వగలరా అని హస్తం నేతల్ని  ప్రశ్నించారు.  ఎందుకంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఇంతకు ముందు కేసీఆర్ కు అమ్ముడు పోయినోళ్లు అంటూ ఘాటు విమర్శలు చేశారు.


అయితే బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరననే గ్యారంటీ ఎవరు ఇస్తారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.  బీజేపీలో కూడా చాలామంది పారాచ్యూట్ నేతలకు టికెట్లు ఇచ్చారు.  వీరంతా కూడా ఎమ్మెల్యేలు అయిన తర్వాత తిరిగి సొంతగూటికి చేరరా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ సందర్భం వస్తే బీఆర్ఎస్ నుంచి కూడా వలసలు ఉండవచ్చు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అని పేర్కొంటున్నారు.


మరోవైపు పార్టీ నాయకుల ఫిరాయింపుల వల్ల బీజేపీ నానాటికీ బలహీనపడుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోతే ఈటల రాజేందర్ ఆ పార్టీలో కొనసాగుతారా అంటే చెప్పలేం. కర్ణాటకలో కూడా సీఎం, ఉపముఖ్యమంత్రి పదవులు చేపట్టిన నాయకులే కాంగ్రెస్ లో చేరారు. వివేక్, రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి ఇలా వరుసగా సీనియర్ నేతలు బీజేపీని వీడి హస్తం గూటికి చేరుతున్నారు. కాబట్టి రాజకీయాల్లో ఏ రాజకీయ నేతకు ఏ పార్టీ గ్యారంటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అవకాశవాద రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: