టీడీపీలో మరో వారసుడు... మంత్రి తమ్ముడుపైనే పోటీకి రెఢీ ?
గత ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన ఆయన, చిత్తూరులో కీలక నేతగా ఎదుగుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా సరే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకెళుతున్నారు. పూర్తిగా వైసీపీ చేతుల్లో ఉన్న జిల్లాలో టీడీపీని పైకి లేపేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. కేవలం తన సొంత నియోజకవర్గం పీలేరులో మాత్రమే కాదు...ఇతర నియోజకవర్గాలపై కూడా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. తనకు పట్టున్న నియోజకవర్గాల్లో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన తంబళ్ళపల్లెపై కూడా ఫోకస్ పెట్టారు. మొన్నటివరకు నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకుడు లేరు. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు. దీంతో తంబళ్ళపల్లెలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వన్ మ్యాన్ షో నడుస్తోంది. ద్వారకానాథ్ దెబ్బకు తంబళ్ళపల్లెలో టీడీపీ పూర్తిగా కష్టాల్లో పడిపోయింది. అయితే కిషోర్ తంబళ్ళపల్లెలో కూడా టీడీపీ కోసం పనిచేయడం మొదలుపెట్టారు.
ఇక ఇటీవల శంకర్ యాదవ్ మళ్ళీ చంద్రబాబుని ఒప్పించి ఇంచార్జ్ పదవి తీసుకున్నారు. కానీ ఈయన గాని సరిగ్గా పనిచేయకపోతే పక్కన పెట్టేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఆరు నెలల టైం ఇచ్చి చూస్తానని శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ పుంజుకోకపోతే ఆయన్ను పక్కన పెట్టేసి కొత్త వారికి పార్టీ పగ్గాలు ఇస్తానని చెప్పారు.
ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చి తంబళ్ళపల్లె టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో తన కుమారుడు అమర్నాథ్ రెడ్డిని తంబళ్ళపల్లె బరిలో దించడానికి సిద్ధమే అని కిషోర్ చెబుతున్నారు. తంబళ్ళపల్లెలో పోటీకి తన వారసుడు రెడీ అని అంటున్నారు. మరి చూడాలి తంబళ్ళపల్లె చివరికి ఎవరికి దక్కుతుందో..?