జగన్కు అమరావతి భూములు అమ్మే హక్కు ఉందా?
అమరావతిని స్మశానం అని చెప్పిన జగన్ ప్రభుత్వం... ఇప్పుడు ఎకరా 10 కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిలదీస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చెయ్యకుండా...ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇచ్చే యత్నాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఆత్మకూరులో గత ఎన్నికలకు, ఉప ఎన్నికలకు ఫలితం తేడా చూస్తే కనీసం వైసీపీకి 10 వేల ఓట్లు కూడా అదనంగా పడలేదని చంద్రబాబు గుర్తు చేశారు.
మూడేళ్ల జగన్ పాలన ప్రజలకు ఒకవైపు పన్నులతో వాతలు పెడుతూ....మరోవైపు పథకాలకు కోతలతో సాగుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలకు అందే పథకాలలో రకరకాల నిబంధనల పేరుతో కోతులు పెట్టి డబ్బులు మిగుల్చుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. చెత్త దగ్గర నుంచి అన్నింటిపైనా పన్నులతో వాతలు పెడుతున్న ప్రభుత్వం.. పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు కొత్త కొత్త నిబంధనలతో కోతలు వేస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు.
అమ్మఒడి పథకంలో 52 వేల మంది లబ్ధిదారులు తగ్గడాన్ని ప్రస్తావించారు. ఒంటరి మహిళల పెన్షన్ వయసు నింబంధనను 50 ఏళ్లకు పెంచి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గించడం అమానవీయం అని మండిపడ్డారు. అమ్మఒడి పథకంలో జగన్ రెడ్డి 52,463 మంది లబ్ధిదారులకు మొండిచేయి చూపారని నేతలు తప్పుబట్టారు. నాణ్యమైన విద్యను అందించడంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం..19వ స్థానానికి పడిపోవడం జగన్ రెడ్డి అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు.