హెరాల్డ్ ఎడిటోరియల్: కవిత రీ ఎంట్రీతో భయపడుతోందెవరు...!
వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యాక తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా కవిత ప్రజలను ఎంతో మేటివేట్ చేశారు. ఇక రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆమె నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి.. లోక్సభలో అటు పార్టీకి మంచి గొంతుకగా మారారు. అదే టైంలో తెలంగాణ సమస్యలను సైతం లోక్సభలో ఎన్నోసార్లు ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన లోక్సభ నియోజకవర్గ పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీని గెలిపించుకున్నారు.
అయితే అనూహ్యంగా ఆ తర్వాత జరిగిన నాలుగు నెలలకే ఆమె ఎంపీగా ఓడిపోయారు. ఆ తర్వాత యేడాది పాటు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. కవితకు రాజకీయ భవిష్యత్తు ఉందా ? అన్న సందేహాలు వస్తోన్న టైంలో ఆమె ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. ఇక ఇప్పుడు ఆమె కేసీఆర్ కేబినెట్లోకి ఎంట్రీ ఇవ్వడం ఒక్కటే మిగిలి ఉందంటున్నారు. ఇక ఇప్పుడు కవిత కేబినెట్లోకి వస్తే ఎవరి బెర్త్కు ఎర్త్ ఉంటుందో ? అన్న సందేహాలు ఇప్పుడు కొందరు మంత్రులను వెంటాడుతున్నాయి.
కేసీఆర్ కేబినెట్లో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. వీరిలో సబితను తప్పించరు.. సత్యవతిని తప్పించే సాహసం కేసీఆర్ చేయరు... ఆమె ఎస్టీ + మహిళా కోటాలో మంత్రిగా ఉన్నారు. ఇక ఇప్పుడు కవితను కేబినెట్లోకి తీసుకుంటే నిజామాబాద్ జిల్లా లేదా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఒకరిద్దరు మంత్రులను తప్పించే ఛాన్సులు ఉన్నాయని అంటున్నారు. ఇక కేటీఆర్ ఇప్పటికే కీలకంగా ఉన్నారు. ఇప్పుడు కవిత, కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉంటే.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే వ్యూహం కూడా ఉండవచ్చని కొందరు అంటున్నారు. ఏదేమనా కవిత కేబినెట్ ఎంట్రీ వార్తలతో కొందరు మంత్రులు టెన్షన్ పడుతుంటే.. రాష్ట్ర నాయకులు కూడా కొందరు ఏం జరుగుతుందా ? అని ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.