హెరాల్డ్ ఎడిటోరియల్ : సీఎంలలో మమత బెనర్జి వేరయ్య..విశ్వదాభిరామ..చూడర రామా..!
ఊరందరిది ఒక దారి అయితే..ఉలిపి కట్టెది మరో దారి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ. లేడీ టైగర్ అని కొంతమంది, దీదీ అని మరికొంతమంది ఇలా మమతను ప్రేమతో పిలుచుకుంటుంటారు ఆ రాష్ట్రప్రజలు. కమ్యూనిస్టుల కంచుకోటగా వర్ధిల్లిన పశ్చిమబెంగాల్లో ఆమె తృణముల్ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చి సంచలనం సృష్టించారు. గడిచిన దశాబ్దన్నర కాలంలో కమ్యూనిస్టు పార్టీలను అక్కడ కకావికలం చేసేశారు. ఇప్పుడు కమ్యూనిస్టుల బలం పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. ఇక అధికారంలోకి వచ్చేంత సీన్ అయితే అస్సలు లేదు.
అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పాలనపై ఆ రాష్ట్ర ప్రజలు విసిగివేసారుతున్నట్లు ఆ మధ్యలో పలు మీడియాల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే అక్కడా కాంగ్రెస్, బీజేపీలు ఇన్నాళ్లు నామమాత్రంగా ఆదరణ పొందుతూ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ రెండు పార్టీలకు ఆదరణ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా బీజేపీకి చాలా బలం పెరిగిందనే చెప్పాలి. ఈ విషయం గమనిస్తూ వస్తున్న దీదీ ప్రాంతీయ అస్తిత్వం పేరుతో జనాలను ఏకీకృతం చేసేందుకు ప్రయత్నాలు ఆరంభించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్న మాటయితే వాస్తవం. ఆమె రాజకీయ అడుగులు కూడా ఆవిధంగా ఉండటం గమనార్హం.
అవసరం ఉన్నా లేకున్నా కేంద్రంలోని ప్రభుత్వాలను విమర్శించడం పనిగా పెట్టుకుంటారన్న విమర్శయితే ఆమెపై ఉంది. గతంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆమె కేంద్రంతో సంఖ్యతగా వ్యవహరించలేదు. ఇప్పుడు ఎన్డీఏతోనూ అలానే వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం..పార్టీలకు మధ్య ఉండే చీలికను గమనించకుండా ఆమె రాజకీయాలు చేస్తుంటారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆగడాలు సాగవు అంటూ ఆ మధ్యలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మమత. ప్రతీ పార్టీ కూడా ప్రజా బాహుళ్యంలో ఆదరణ పొందేందుకు ఎత్తులు వేస్తునే ఉంటుంది. అయితే దేశం వేరు..మేం వేరు అన్నట్లుగా మమత వైఖరి ఉండటం మనం గమనించవచ్చు. తాజాగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా సరకు రవాణాను పశ్చిమ బంగా ప్రభుత్వం అడ్డుకోవడంతో కేంద్రం మండిపడుతోంది.
కరోనా కేసుల సంఖ్య, కేంద్ర బృందాల పర్యటన విషయంలో ఇప్పటికే వివాదం నడుస్తుండగా ఈ విషయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల అంశంలో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. కేంద్రం ఎన్నిసార్లు ఆదేశాలిస్తున్నా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా నిత్యావసరాల సరఫరాకు అనుమతించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా స్వయంగా మరోసారి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఇంకా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం గమనార్హం. ఈ పరిణామంతో మమతపై దేశ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple