టీడీపీ కార్యకర్తల్లో పెరుగుతున్నఅసహనం, సైడ్ అయిపోతున్నారా...?
రాజకీయంగా టీడీపీ ఎంత బలంగా ఉన్నా సరే క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ పార్టీ బలం వేరు. ఆ పార్టీకి ముందు నుంచి కూడా కార్యకర్తల బలం కాస్త ఎక్కువగానే ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. మూడున్నర దశాబ్దాల చరిత్రలో టీడీపీ ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడింది అంటే కేవలం బలమైన కార్యకర్తలే. ప్రస్తుతం పార్టీలో జరుగుతోన్న పరిణామాలు, చంద్రబాబు ఉదాసీన వైఖరి, అటు లోకేష్ వ్యవహరిస్తోన్న తీరు, నందమూరి కుటుంబాన్ని పక్కన పెట్టేయడంతో ఇప్పుడు ఆ కార్యకర్తలు తీవ్ర అసహనంగా ఉన్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. చిన్న నేతలు.. పెద్ద నేతలు అందరూ కూడా ఇప్పుడు కాస్త చికాకుగా ప్రవర్తిస్తున్నారు.
రాజకీయంగా బలపడాల్సిన సమయంలో కొందరు నేతల తీరు చూసి కార్యకర్తలు కూడా విస్మయం వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది అనే చెప్పాలి. ఇక ఇప్పుడు కొందరు నేతలు అవినీతిలో దొరకడంతో కార్యకర్తలు ఇన్ని రోజులు జగన్ ని అవినీతి పరుడు అని ఆరోపించి... ఇప్పుడు తమ పార్టీ నేతల ఒక్కో అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో వైసీపీ కార్యకర్తల నుంచి ఎటాక్లు జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్న ఆవేదన కేడర్లో ఉంది.
మరోవైపు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకే చంద్రబాబు బిల్లులు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో ఆర్థికంగా నష్టపోయిన కార్యకర్తలు కూడా ఇప్పుడు పార్టీ మారడం మినహా చేసేదేం లేదని డిసైడ్ అయ్యారు. ఇక అగ్ర నేతలు కొందరు ఇప్పుడు ఈ అవినీతి వ్యవహారాల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. వారి అందరిలో కూడా కనపడని ఆవేదన అనేది ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.
అందుకే ఇప్పుడు కార్యకర్తలు అందరూ సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నారు అని ఇన్ని రోజులు యాక్టివ్ గా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సైడ్ అయిపోతున్నారు అని అంటున్నారు. చాలా మంది కార్యకర్తలు సోషల్ మీడియా ఖాతాలను క్లోజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో కౌంటర్లు వేసినా కూడా కేసులు నమోదు అవుతున్నాయి. అయినా పార్టీ నుంచి ఎలాంటి భరోసా ఉండదు. అందుకే కార్యకర్తలు నమ్మకం, భరోసా ఇచ్చే నాయకుడు లేక విలవిల్లాడుతున్నారు.