ప్రియాంక సీఎం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ మైండ్ గేమ్.. సోనియా స్కెచ్ అదే...
యూపీ రాజకీయాలపై కాంగ్రెస్ దృష్టిసారిస్తోంది. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే క్రమంలో ప్రియాంకా గాంధీ చరిష్మాను వాడుకునేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంకను బరిలోకి దించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధమవుతోందని తెలుస్తోంది. గత నెలరోజులుగా తరుచూ ఈ వార్త తెరమీదకు రావడం..మీడియాలో రావడం వెనుక కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మక ధోరణి ఉన్నట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంకాగాంధీని ముందస్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భావిస్తోందంట.
కొంతకాలంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏఐసీసీ సభ్యుల నుంచి మీడియాకు, పార్టీ శ్రేణులకు లీకులు ఇస్తున్నారు, దీంతో అటు పార్టీలో ఇటు ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంటుందనే విషయంపై ఆమె వ్యూహాత్మక ధోరణితో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని అధిష్ఠానం ఫైనల్ చేసిందని, అందుకు ప్రియాంక కూడా అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాదా శనివారం వెల్లడించారు. అలాగే మూడు రోజుల క్రితం సోనియా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అహ్మద్పటేల్ యూపీలోని కొంతమంది ముఖ్యనేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రియాంకా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వ ప్రకటనపై సమాలోచనలు చేశారని ఓ వార్త ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఈ వార్త నిజానికి ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. యూపీలో పాగవేయడంపై ఇప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఎక్కువ దృష్టి పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రియాంకా ఇప్పటికే తరుచూ యూపీ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అయితే ప్రియాంకాగాంధీ యూపీలో భారీ బహిరంగ సభతో గాని, ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమంతో గాని జనంలోకి వెళ్లాలని భావిస్తున్నారని యూపీ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మరి యూపీలో బీజేపీని తట్టుకుని ప్రియాంకా నిలబడి పార్టీకి పూర్వ వైభవం తెస్తుందో లేదో అన్నది కాలమే నిర్ణయించాలి.