హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్డీఏలో వైసీపీ చేరికపై ప్రతిపక్షాలు ఎందుకు గోలచేస్తున్నాయి ?
పార్టీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు, శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎన్డీఏలో చేరమని ప్రధాని ఆహ్వానించినట్లు వైసిపి అబద్ధపు వార్తలు రాయించుకుంటోందంటూ గోల మొదలుపెట్టేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిజంగానే వైసిపి అబద్ధపు వార్తలే రాయించుకుంటోందనే అనుకుందాం. దీనికి స్పందించాల్సింది ఎవరు ? బీజేపీ అగ్రనేతలా ? లేకపోతే టీడీపీ నేతలా ? వైసిపిని ఎన్డీఏలో చేరమని ప్రధానమంత్రి ఆహ్వానించలేదంటు ఖండించాల్సింది బీజేపీ నేతలే కదా. మరెందుకు టీడీపీ నేతలు గొంతులు అరిగిపోయేలాగ గోల చూస్తున్నట్లు ? అటు బీజేపీ ఇటు వైసీపీ బాగానే ఉన్నాయి. మధ్యలో టీడీపీ ఎందుకింత కంగారు పడుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎన్డీఏలో వైసీపీ చేరితే టీడీపీకి వచ్చే నష్టం ఏమిటి ? ఎన్డీఏలో చేరకపోతే వచ్చే లాభం ఏమిటి ?
వైసీపీ-ఎన్డీఏ విషయంలో టీడీపీకి కొత్తగా వచ్చే నష్టం లేదు, లాభమూ లేదు. ఎందుకంటే చంద్రబాబునాయుడుకు జరగాల్సిన డ్యామేజి మొన్నటి ఎన్నికల్లోనే జరిగిపోయింది. తనను నమ్మి మళ్ళీ ఎన్డీఏలో మోడి చేర్చుకుంటాడేమోనని చంద్రబాబు చాలా ఆశతో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడెపుడు మోడి నుండో లేకపోతే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నుండి పిలుపొస్తుందా అని ఆశగా చంద్రబాబు ఎదురు చూస్తున్నాడు. బీజేపీకి దగ్గరవుదామని చంద్రబాబు ఎంత ప్రయత్నాలు చేస్తే మోడి, షాలు అంత దూరంగా పెట్టేస్తున్నారు. దాంతో తమకు అవకాశం లేకపోయినా జగన్ మాత్రం ఎన్డీఏలో చేరకూడదని చంద్రబాబు+టీడీపీ నేతలు బాగా కోరుకుంటున్నట్లున్నారు. ఎలాగూ వీళ్ళను భుజాన మోసే ఎల్లోమీడియా ఉండనే ఉంది. అందుకనే తమలోని కోరికనంతా ఎల్లోబ్యాచ్ ఎల్లోమీడియా ద్వారా బయటపెడుతున్నారు.