హెరాల్డ్ ఎడిటోరియల్ : ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని జగన్ కొట్టబోతున్నాడా ?
దురదృష్టం ఏమిటంటే రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు కూడా రాజకీయా ఆటుపోట్లకు గురవ్వటం. ఇటువంటి దరిద్రపు గొట్టు రాజకీయం మరే రాష్ట్రంలోను చూడమేమో. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్ధితులను అడ్డం పెట్టుకుని నరేంద్రమోడి సర్కార్ ఆటలాడటం మొదలుపెట్టింది. తాజాగా కేంద్రం చెప్పిన నిధుల లెక్కలతో పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తికాదన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. పోయిన ఎన్నికల్లో చంద్రబాబుపై బాగా అవినీతి ఆరోపణలు రావటానికి పోలవరం ప్రాజెక్టు కూడా ఒకటన్న విషయం మరచిపోకూడదు. విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు బలవంతంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. అప్పటి నుండి అంచనాలను తనిష్టం వచ్చినట్లు సవరించుకోవటం, కాంట్రాక్టర్లను తనిష్టం వచ్చినట్లు మార్చుకోవటంతో అవినీతి ఆరోపణలు విపరీతంగా పెరిగిపోయాయి.
ఇటువంటి అనేక కారణాలను గమనించిన తర్వాత తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను జగన్ కేంద్రానికి అప్పగించేయాలని డిసైడ్ చేసినట్లు సమాచారం. దీనివల్ల జగన్ కు చాలా పెద్ద రిలీఫ్ వస్తుందనటంలో సందేహమే లేదు. ఎలాగంటే ప్రాజెక్టు ఖర్చుకి పదివేల కోట్లే ఖర్చుపెడుతుందో లేకపోతే లక్ష కోట్లతో పూర్తి చేస్తుందో పూర్తిగా కేంద్రానిదే బాధ్యత. రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఖర్చుండదన్న విషయం అందరికీ తెలిసిందే. నిర్మాణాన్ని పూర్తి చేసి రాష్ట్రానికి అప్పగించటమే కేంద్రం చేయాల్సింది. దీని వల్ల ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందనే ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం మీదుండదు. లాభమొచ్చినా, నష్టమొచ్చినా మొత్తం కేంద్రానికి బాధ్యత. అలాకాదని ప్రాజెక్టు నిర్మాణాన్ని తీసుకోవటానికి కేంద్రం ఒప్పుకోకుండా రాష్ట్రమే పూర్తి చేయాలని కేంద్రం స్పష్టంగా చెప్పిందే అనుకుందాం. అపుడు రాష్ట్రప్రభుత్వం పంపిన సవరించిన అంచనాల ప్రకారం నిధులు మంజూరు చేస్తేనే బాధ్యతలు తీసుకుంటామన్ను కండీషన్ను జగన్ పెట్టబోతున్నారు. ఇదే విషయమై తేల్చటానికి రాష్ట్రం తరపున ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని ఢిల్లీకి వెళ్ళమన్నారు.