నరేంద్రమోడిని వ్యతిరేకించే శక్తులు దేశంలో చాలానే ఉన్నాయి. అయితే ఆ శక్తుల్లో ఐకమత్యం లేకపోవటం, ఆయా రాష్ట్రాల్లో పెద్దగా బలంగా లేకపోవటం వల్లే బలహీనమైపోతున్నాయి. ఇదే సమయంలో జాతీయస్ధాయిలో మోడి లేదా బీజేపీని ధీటుగా ఎదుర్కొవాల్సిన కాంగ్రెస్ అత్యంత బలహీనంగా తయారైంది. ఇలాంటి కొన్ని అంశాలు మోడి+బీజేపీకి బాగా కలిసొస్తున్నాయి. కాబట్టే తాను ఆడిందే ఆటగా మోడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దేశ భవిష్యత్తుకు సంబంధించి కానీ కరోనా వైరస్ నియంత్రణ విషయంలో కానీ ప్రతిపక్షాల సలహాలు, సూచనలను మోడి ఏమాత్రం లెక్క చేయటంలేదు. లోక్ సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రతిపక్షాల సభ్యులు చేసిన సూచనలను మోడి పట్టించుకోవటమే లేదు. చివరకు మంత్రివర్గంలోని సహచరులకు మోడికి సలహాలు, సూచనలు చేసేంత సీన్ లేదని అందరికీ తెలిసిందే.
నిజానికి పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వ్యవస్ధ ఏర్పాటు సమయంలోనే మోడిపై జనాల్లో వ్యతిరేకత మొదలైపోయింది. అయితే ఆ వ్యతిరేకత సంఘటితం కాలేదు కాబట్టి ప్రభావం చూపలేదు. పోయిన ఏడాది మొదలైన కరోనా వైరస్ నియంత్రణలో మోడి సర్కార్ వైఫల్యంతో జనాల్లో వ్యతిరేకత మొదలైంది. సెకెండ్ వేవ్ లో యావత్ దేశం సంక్షోభంలోకి కూరుకుపోవటంతో మోడిపై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ఈ వ్యతిరేకతే ఐదురాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా బెంగాల్ ఎన్నికల్లో స్పష్టంగా తెలిసిపోయింది. ఇదే సమయంలో మమత ఒంటరిగా పోరాడి మోడి అండ్ కో పై విజయం సాధించటం అద్భుతమనే చెప్పాలి. మమత సాధించిన విజయమే ప్రతిపక్షాల ఆశలకు ఊపిరిపోస్తున్నాయి. చిత్తశుద్దితో, శ్రమించి పోరాడితే మోడి అండ్ కోను ఓడించటం కష్టం కాదని మమత నిరూపించారు.
ఇందుకే వచ్చే ఏడాది మేనెలలో జరగనున్న ఐదురాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు చేతులు కలిపే అవకాశాలు కనబడుతున్నాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ పెద్ద రాష్ట్రాలు, మిగిలినవి చిన్నవి. అయితే రాష్ట్రం పెద్దదయినా చిన్నదైనా ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాటం చేస్తే బీజేపీని ఓడించే అవకాశాలున్నాయి. పై రాష్ట్రాల్లో యూపీ, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారంలో ఉంది. పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. యూపీలో సమాజ్ వాదీపార్టీ, బహుజన్ సమాజ్ వాదీపార్టీ బలమైన ప్రాంతీయ పార్టీలు. వీటికి కాంగ్రెస్ కూడా తోడై స్పష్టమైన సీట్ల షేరింగ్ తో సమన్వయంగా పోరాడితే బీజేపీని ఓడించచ్చనే విశ్లేషణలు పెరిగిపోతున్నాయి. పంజాబ్ లో బీజేపీ, ప్రతిపక్షాలు పెద్దగా బలంగా ఏమీలేవు. అయినా మిత్రపక్షాలను కలుపుకుని వెళితే కాంగ్రెస్ విజయం తధమ్యట. ఇక మిగిలిన చిన్న రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాలు గట్టిగా జట్టుకడితే మంచి ఫలితాలు సాధించచ్చనే అబిప్రాయం పెరిగిపోతోంది. మరి బీజేపీయేతర పార్టీలు ఏమి చేస్తాయో చూడాలి.