పాపం షర్మిలక్క.. సైడ్ అయిపోయిందిగా...?

ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒకటే హాట్ టాపిక్.. అదే కేసీఆర్ వర్సస్ ఈటల రాజేందర్. ఈటల రాజేందర్‌ ఇప్పుడు ఏం చేస్తారు.. ఈటల యాక్షన్ ప్లాన్ ఏంటి.. ఈటల పార్టీ పెడతారా.. లేక.. ఏదైనా పార్టీలో చేరతారా.. ఒంటరి పోరు సాగిస్తారా.. ఈటల వెంట వచ్చేదెవరు.. ఈటల మరో కేసీఆర్‌ గా మారగలుగుతారా.. లేక.. ఇప్పటికే కేసీఆర్ చేతిలో పరాభవానికి గురైన సొంత పార్టీ నేతల జాబితాలో మరో వ్యక్తిగా మిగిలి పోతారా.. నరేంద్ర, విజయశాంతి, డీఎస్‌.. తరహాలో ఈటల రాజేందర్ మరో పావుగా మిగిలిపోతారా.. ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ఫోకస్ అంతా కేసీఆర్, ఈటల రాజేందర్ వైపే ఉంది. అందులోనూ ఈటల భూఅక్రమాలపై కలెక్టర్ విచారణను హైకోర్టు కూడా తప్పుబట్టిన నేపథ్యంలో ఈటలకు సానుభూతి పెరుగుతోంది. మరి ఈ సానుభూతి ఈటలకు రాజకీయంగా ఉపయోగపడుతుందా.. ఇలా అనేక ప్రశ్నలతో ఈ వ్యవహారం రంజుగా సాగుతోంది. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. ఈ ఈటల ఫోకస్‌ కారణంగా నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో హాట్ టాపిక్ అయిన షర్మిల పార్టీ వ్యవహారం ఒ‌క్కసారిగా సైడ్ అయిపోయింది.

గత నెలలలో ఖమ్మంలో బహిరంగ సభ ద్వారా కాస్త సత్తా చాటిన షర్మిల ఒక విధంగా తెలంగాణలో రాజకీయ సంచలనమే సృష్టించారు.  ఏకంగా నేరుగా కేసీఆర్‌ను ప్రశ్నించడం ద్వారా బాగా ఎలివేట్ అయ్యారు. ఆ వెంటనే హైదరాబాద్‌లో దీక్ష చేయడం.. ఆ దీక్ష సందర్భంగా ఆమెను పోలీసులు ఇబ్బంది పెట్టడం.. ఆమె జాకెట్ కూడా చినగడం వంటి ఘట్టాలతో ఒక్కసారిగా షర్మిల తెలంగాణ పాలిటిక్స్‌లో హైలెట్ అయ్యారు. ఒకరిద్దరు చిన్న నాయకుల చేరికలు కూడా కొనసాగాయి.

ఇప్పుడు అనూహ్యంగా ఈటల రాజేందర్ ఎపిసోడ్ ప్రారంభం కావడంతో షర్మిల ఒక్కసారిగా సైడ్ అయ్యారు. ఇప్పుడు అంతా ఈటల గురించే మాట్లాడుతున్నారు. షర్మిలను పట్టించుకునే వారు కనిపించడం లేదు. మరి ఈ సమయంలో షర్మిల ఇంకేదైనా ఎత్తు వేస్తారా.. తన ఉనికి చాటుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: