మల్లారెడ్డికి తలనొప్పిగా ఈటల ఎపిసోడ్.. టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు
ఈటల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కేవలం ఆరోపణలు వచ్చినందుకే ఈటలను మంత్రిపదవి నుంచి బర్తరఫ్ చేయడం పట్ల తెరాస శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. సీఎం కేసీఆర్ కావాలనే బీసీ నేతగా పేరుపొందిన ఈటల రాజేందర్ను పక్కకు తప్పించాడని పలు బీసీ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలుసైతం ఈటల వ్యవహారంలో సీఎం కేసీఆర్ను ఇరుకన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయంటూ చర్యలు తీసుకున్న కేసీఆర్.. తెరాసలో మంత్రులు, ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలు పట్టించుకోరా అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా కార్మికశాఖ మంత్రిగా ఉన్న మల్లారెడ్డిని టార్గెట్గా చేసుకొని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటం గమనార్హం.
మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జాల విషయంలో పలుసార్లు ఆరోపణలు వచ్చాయి. అయితే గతంలో వీటిపై ప్రతిపక్ష పార్టీలు దృష్టిసారించలేదు. ప్రస్తుతం ఈటల ఎపిసోడ్తో మల్లారెడ్డిని టార్గెట్గా ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మల్లారెడ్డిపై బస్తీమే సవాల్ అంటూ కాలుదువ్వుతున్నాడు. దేవరయాంజాల్ ఆలయ భూముల ఆక్రమణలపై సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఆలయం మన్యాలను మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి బంధువులు, అనుచరులు ఆక్రమించి భవనాలు, ఫామ్ హౌస్లు నిర్మిస్తే ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ కమిటీ బృందానికి అవి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. దేవుడి మాన్యాల ఆక్రమణలను ప్రోత్సహిస్తున్న మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మొత్తానికి సీఎం కేసీఆర్ ఈటలపై గురిపెట్టి బాణం వదిలితే.. ప్రతిపక్షాల నుంచి పది బాణాలు మంత్రులు, ఎమ్మెల్యేల వైపు దూసుకొస్తుండటంతో పలువురు మంత్రులు తలలు పట్టుకుంటున్నారట.