మోడీ కంటే ప్రధానిగా ఆయన ఉంటే బావుండేదా..?
ఇలాంటి పరీక్షా సమయంలో దేశ ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రధాని మోడీ తీరుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్లో ప్రధాని మోడీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.. పదిరోజులకోసారి.. నెలరోజులకోసారి మీడియా ముందుకు వచ్చి.. మిత్రోం.. అంటూ తెగ హడావిడి చేశారు. జనతా కర్ఫ్యూ ప్రకటన, తప్పెట్ల మోత.. దీపాలు వెలిగించడం.. ఇలా ఎన్నో నాటకీయ పిలుపులు ఇచ్చారు.
ఇలాంటి సమయంలో దేశ రాజధానిలో అరవింద్ కేజ్రీవాల్ బాగా కరోనాను కట్టడి చేస్తున్నారన్న ప్రశంసలు వస్తున్నాయి. ఆయన ఢిల్లీలో పరిస్థితిని కొన్నిరోజుల్లోనే అదుపులోకి తెచ్చారు. అంతే కాదు.. ఆయన కేవలం డిల్లీ గురించే కాకుండా దేశం గురించి ఆలోచిస్తూ తన ఆలోచనలు చెబుతున్నారు. తాజాగా టీకాల కొరతను అధిగమించేందుకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి పలు కీలక సూచనలు చేశారు. దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకా ఉత్పత్తిని తప్పనిసరి చేస్తూ దేశంలో ఉన్న వ్యాక్సిన్ తయారీ సంస్థలన్నింటికీ ఆదేశాలు జారీ చేయాలన్నారు.
విదేశీ టీకా తయారీ సంస్థల నుంచి కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని సూచిస్తున్నారు. కొన్ని దేశాలు వారి జనాభాకు సరిపడే కంటే ఎక్కువ వ్యాక్సిన్లు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నాయని.. వాటిని వెంటనే భారత్కు అందజేసేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. మొన్నటికి మొన్న సింగపూర్ వేరియంట్ గురించి అప్రమత్తంచేశారు. ఇవన్నీ చూస్తుంటే.. ఇలాంటి సమయంలో కేజ్రీవాల్ పీఎంగా ఉంటే బావుండేదన్న వాదన వినిపిస్తోంది.