సాయిరెడ్డి వ‌ర్సెస్ గ‌జ‌ప‌తిరాజు.. విన్న‌రెవ‌రు..?

VUYYURU SUBHASH
ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో త‌న హ‌వా కొన‌సాగించేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఎంపీ విజ‌యసాయిరెడ్డి.. జిల్లాల వారీగా త‌న ప‌ట్టు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిలో భాగంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న విజ‌యన‌గ‌రం జిల్లాలో వైసీపీ మంత్రి బొత్స‌ను ప‌క్క‌న‌పెడితే.. అశోక్ గ‌జ‌ప‌తి రాజు ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు, రాజకీయంగా ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టేలా చేసేందుకు, ప్ర‌జ‌ల్లో చుల‌క‌న భావం క‌లిగించేందుకు సాయిరెడ్డి గ‌ట్టిగానే కృషి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో పూస‌పాటి వంశీయుల‌కు చెందిన మాన్సాస్ ట్ర‌స్టు స‌హా ప్ర‌ముఖ దేవాల‌యం సింహాచ‌లం ట్ర‌స్టు ప‌ద‌వుల నుంచి రాత్రికి రాత్రి ఆయ‌న‌ను ట్ర‌స్టీగా తొల‌గించి.. ఇదే కుటుంబానికి చెందిన పూస‌పాటి సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజును నియ‌మించారు.

చాలా దూకుడుతో తీసుకున్న నిర్ణ‌యం.. వెంట‌నే స‌ర్కారు జీవో జారీ చేయ‌డం, అశోక్ ను త‌ప్పించి ఆ వెంట‌నే ఢిల్లీ నుంచి సంచ‌యిత‌ను ర‌ప్పించి.. ఇక్క‌డ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం.. వెంట వెంట‌నే జ‌రిగిపోయాయి. అయితే.. ఈ దూకుడు రాజకీయాల‌కు అడ్డుక‌ట్ట వేస్తూ.. న్యాయ‌ప‌రంగా ముందుకు సాగారు.. అశోక్‌. దీంతో ఆయ‌న హైకోర్టులో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ప్ర‌భుత్వం(ప‌రోక్షంగా సాయిరెడ్డి), సంచ‌యిత‌లు మ‌ళ్లీ హైకోర్టు డివిజ‌న్ బెంచ్‌లో ఈ తీర్పును స‌వాల్ చేశారు. దీనిపై విచార‌ణ సాగాల్సి ఉంది. ఇదిలావుంటే.. మ‌రో వైపు మాన్సాస్ ట్ర‌స్టుకు సంబంధించిన పూర్వాప‌రాలు.. ద‌స్తావేజులు, వీలునామానాలు వంటివాటిని త‌వ్వితీసి.. వీటి ద్వారా త‌న పైచేయిసాధించేందుకు సాయిరెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే మాన్సాస్ సంస్ధకు సంబంధించి 2004, 2005 సంవత్సరం నుంచి అధికారులు ఆడిట్ మొదలు పెట్టారు.  ట్ర‌స్టుకు సంబంధించిన భూములు, ఇతర ఆర్థిక లావాదేవీల‌పై ఆడిట్ మొద‌లు పెట్టారు. మొత్తం 27మంది ఆడిట్ అధికారులు ఏక‌కాలంలో రంగంలోకి దిగి ఈ లెక్క‌లతో కుస్తీ ప‌న‌డుతున్నారు. వీరిని 4 టీములుగా విభజించి ఆడిట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ లెక్క‌లు తేలేందుకు నెల రోజులుకు పైగా ఆడిట్ జరుగుతుంద‌ని అధికారులు చెబుతున్నారు. మ‌రోవైపు గత ఈవో గా పనిచేసిన కె.రామ‌చంద్ర మోహన్ మాన్సాస్ భూముల విషయంలో అవకతవకలు జ‌రిగాయ‌ని ఆరోపించ‌డం వెనుక సాయిరెడ్డి ఉన్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే రాత్రికి రాత్రి మ‌ళ్లీ ఆడిట్ రాజ‌కీయం తెర‌మీదికి వ‌చ్చింది. అయితే.. సాయిరెడ్డి సెంట్రిక్‌గా జ‌రుగుతున్న ఈ వ్యూహాన్ని అశోక్ గ‌జ‌ప‌తిరాజు.. అంతే వ్యూహంతో సైలెంట్‌గా ఎదుర్కొంటుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో సాయిరెడ్డి దూకుడు.. అశోక్ న్యాయ‌ప‌ర‌మైన‌.. వ్యూహంలో ఎవ‌రు విజ‌యం ద‌క్కించుకుంటార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. వాస్త‌వానికి అశోక్‌దే విజ‌యమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: