జగన్ ఆయనకు బావ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి ఇంటి అల్లుడు. మొదట్నుంచి ఇదే మాట చెబుతూ వచ్చాడు. ఎన్నికల ముందు కూడా జగన్ ను కలిసి వచ్చాడు. సాక్షాత్తూ జగన్ మ్యానిఫేస్టోకు దగ్గరగా ఉండేలా తన హామీలు ఇస్తూ వచ్చాడు. ఇవన్నీ బాగున్నాయి. అల్లుడి కృషి కారణంగానే గెలుపు అని చెప్పలేం. కానీ అందుకు కారణం అయిన వారిలో ఎందరో ఉన్నారు. అదేవిధంగా జగన్ పై ఉంచిన నమ్మకం వల్ల రేపటి వేళ మా అసోసియేషన్ కు మంచి జరిగేందుకు అవకాశాలే ఎక్కువ. మా ఎన్నికల రీత్యా ఎన్నో వ్యాఖ్యలు విన్నా, ఎన్నో నిందలు భరించాల్సి వచ్చినా, ఈ విషయంలో ఆ ఇంటి అల్లుడు అత్తారింటి పరువు నిలబెట్టాడు. తండ్రి కోపిష్టి అనిపించుకున్నా ఆయన కోపాన్ని భావోద్వేగాలను ఆఖరి నిమిషం వరకూ తగ్గిస్తూనే వచ్చాడు.
దసరాకు అల్లుడే వచ్చాడు. మంచు వారింటి అల్లుడు వచ్చాడు. మా అధ్యక్ష పీఠం పైకి వచ్చాడు. ఈ దసరా పండుగ విజేత ఎవ్వడో తేలిపోయాడు.. నా అంత తెలుగు నీకు వచ్చా అన్న ప్రకాశ్ రాజ్ ను తుక్కు తుక్కుగా ఓడించాడు. మొదట్నుంచి తండ్రి మోహన్ బాబు కొడుకు గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. సీనియర్ల ఆశీస్సులు అందుకునేందుకు విష్ణు తో చేయించిన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యాయి. విష్ణు భాషను హేళను చేశారు ప్రకాశ్ రాజ్.. ఈ జాతికి జాతీయ అవార్డు తెచ్చిన వాడిని నేనే అని బీరాలు పలికారు. కానీ ఇవన్నీ తేలిపోయాయి. ఆయన మాటల్లో సత్తా లేదని తేలిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సులు తనకు ఉన్నాయన్న మాటను కూడా ఆయన వెక్కిరించారు.
ఇరు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలతోనూ తాను మాట్లాడి మా సమస్యలను ఓ కొలిక్కి తెస్తానన్న మాటను ఓటర్లు నమ్మారు. ముఖ్యంగా విష్ణు కన్నా ప్రకాశ్ రాజ్ టీం చేసిన వ్యాఖ్యలే అధికంగా ఓటర్లను ప్రభావితం చేసి, ఆఖరికి ఓటు మంచు నట వారసుడికి వేసేలా చేశాయి. ఇండస్ట్రీలో ఉన్న కార్మిక కుటుంబాలతో భేటీ అయిన తీరు కూడా మంచు విష్ణుకు బాగా కలిసివచ్చింది. ఇంకా వైఎస్సార్ అభిమానులకు అనుగుణంగా విష్ణు చెప్పిన మాటలు కూడా బాగున్నాయి. తండ్రి మోహన్ బాబు తెర వెనుక అంతా తానై నడిపారు. జగన్ కూడా ఇప్పుడు చాలా ఆనందంగానే ఉంటారు. తమ ఇంటి అల్లుడు తీసుకువచ్చిన కానుక ఇది అని సంబరపడిపోతారు కూడా!