కేంద్రమే మెచ్చిందోచ్: కాలరెగరేసిన కేసీఆర్, జగన్..!?
తాజాగా 2021 ఏడాది పూర్తవవుతున్న సమయంలో ఈ ఏడాది రాష్ట్రాల్లోని ఆరోగ్య పరిస్థితులపై ఈ నీతి ఆయోగ్ చేసిన అధ్యయనం వివరాలు వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం దేశంలోనే అత్యుత్తమ వైద్య సదుపాయాలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ క్రమంగా మూడు, నాలుగు స్థానాల్లో నిలవడం గమనార్హం. ఈ ర్యాంకులు చూస్తే అటు కేసీఆర్, ఇటు జగన్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
2019-20 ఫలితాలతో నీతి ఆయోగ్ ఈ నివేదిక విడుదల చేసింది. ఈ జాబితాలో తొలి 4 స్థానాల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఏపీ నిలిచాయి. రాష్ట్రాల్లోని వైద్య సౌకర్యాల పురోగతిని మధిస్తూ నీతిఆయోగ్ ఈ నివేదికను విడుదల చేసింది. వైద్య వసతుల్లో కేరళ రాష్ట్రం వరుసగా నాలుగోసారి అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక పెద్ద రాష్ట్రాల జాబితాలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అట్టడుగున నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్, బీహార్ ఉన్నాయి.
చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే.. మిజోరం అత్యుత్తమ పనితీరు కనబరిచింది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ మంచి ప్రదర్శన కనపరిచాయని నీతి ఆయోగ్ నివేదిక చెబుతోంది. మొత్తం మీద ఈ జాబితాలో ఫస్ట్ ఫైవ్లో స్థానం సంపాదించినందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలు తెగ ఆనందపడిపోతున్నారు.