మోది బడ్జెట్‌: తెలంగాణ జనం ఆశలు ఇవీ..?

కేంద్ర బడ్జెట్ రాబోతోంది. రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో ఇప్పుడు దేశం చూపు మొత్తం ఆమె వైపే ఉంది. ఈ బడ్జెట్‌లో ఏ అంశానికి ప్రాధాన్యం ఇస్తారు.. ఎవరికి మేలు చేస్తారు.. ఎవరికి ఊరట కలుగుతుంది.. ఎవరిపై పన్నులు బాదుతారు.. ఇలాంటి అంశాలపై చర్చ జరగుతోంది. అయితే.. బడ్జెట్‌కు ముందే.. అనేక రాష్ట్రాలు తమను కరుణించమని కోరుతూ ఆర్థిక మంత్రికి నివేదికలు పంపాయి.


తెలంగాణ విషయానికి వస్తే.. విభజనచట్టంలో ఇచ్చిన హామీల అమలు గురించి తెలంగాణ ఆర్థిక మంత్రిని పదే పదే కోరింది. ఇప్పటికే కేంద్రానికి అనేక విజ్ఞప్తులు పంపింది. పెండింగ్ అంశాలతో పాటు ఆయా రంగాలు, అంశాల్లో తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరింది. రాష్ట్రానికి రావాల్సిన వివిధ బకాయిలు, పెండింగ్ నిధుల గురించి తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ రూపాల్లో ఇంకా రూ. 30 వేల 751 కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిని  వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు కోరారు. వెనకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిధులు రెండేళ్లుగా  బకాయిలు ఉన్నాయి. ఇవే 900 కోట్లు వరకూ రావాలి. అలాగే  మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అమలు కోసం రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ ఎప్పుడో సిఫారసు చేసింది. వాటిని ఇప్పటి వరకూ పట్టించుకున్న దాఖలాలు లేవు.


కాళేశ్వరానికి కానీ పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు కానీ జాతీయ హోదా కల్పించాలని ఇప్పటికే అనేక సార్లు రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేశారు హరీశ్ రావు. అలాగే  కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వనేలేదు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒకసారి ఇచ్చి మరీ ఆపేసిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టు ముందుకు వెళ్లనేలేదు. వీటిలో సగానికైనా కేంద్రం మంజూరు చేస్తే అదే పదివేలన్న అభిప్రాయం ఉంది. మరి కేంద్రం ఈ బడ్జెట్‌లో తెలంగాణను ఎంతవరకూ కరుణిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: