మోదీ బడ్జెట్: నిర్మలమ్మా.. ఈ విన్నపాలు వినాలమ్మా!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఇది నాలుగో బడ్జెట్. బడ్జెట్ ద్వారా హోటళ్ల రంగం రుణ మారటోరియం కోరుకుంటోంది. అలాగే పన్ను రహిత ఫిక్స్డ్ డిపాజిట్లను మూడేళ్ల కాలానికి తగ్గిస్తే మంచిదని బ్యాంకులు కోరుకుంటున్నాయి. ఇలా చేస్తే పన్ను ప్రయోజనం పొందేందుకు ఈ డిపాజిట్లు చేసేందుకు జనం ముందుకొస్తారని బ్యాంకులు అంటున్నాయి. ఇక ద్విచక్ర వాహనాలపై వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గించాలని ఆటో రంగం కోరుకుంటోంది. దీని వల్ల వాహనాలకు గిరాకీ పెరుగుతుందని చెబుతోంది.
క్రిప్టో కరెన్సీల ఆదాయంపై 30 శాతం పన్ను శ్లాబు ఉండాలని మరికొందరు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగై ఫైనాన్షియల్ స్టార్టప్లను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆ రంగ నిపుణలు కోరుతున్నారు. ఈ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల గణనీయమైన ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెబుతున్నారు. ఆరోగ్య సంరక్షణ రంగానికి నిధుల కేటాయింపు భారీగా పెంచాలని ఫార్మా ఇండస్ట్రీ కోరుకుంటోంది.
ఇక బీమా రంగానికి వస్తే.. 80సి సెక్షన్లో పెట్టుబడుల పరిమితిని పెంచాలని కోరుతోంది. అలాగే బీమా ప్రీమియం పరిమితిని లక్ష రూపాయల వరకు మినహాయించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాయి బీమా సంస్థలు. ఆరోగ్య పాలసీలపై జీఎస్టీని కూడా తగ్గించాలంటున్నాయి. దీన్ని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తే ప్రజలకు మంచి సేవలు అందుతాయని చెబుతున్నాయి.