ఉద్యోగులు వర్సెస్‌ జగన్: రాజీ కుదిరినట్టేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన చేస్తున్నఉద్యోగులకూ.. ప్రభుత్వానికి మధ్య రాజీ కుదిరినట్టే అనిపిస్తోంది. నిన్న రాత్రి మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చించారు. అనేక అంశాలపై రెండు బృందాల మధ్య రాజీ కుదిరినట్టు తెలుస్తోంది. పీఆర్సీ అంశంపై ఉద్యోగుల అసంతృప్తి ని సరిదిద్దేదుకు మంత్రుల కమిటీ ప్రయత్నం చేసిందని చర్చల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగ సంఘాల నేత అనుమానాలు నివృత్తి చేశామని కొన్ని సర్దుబాటు చేశామని ఆయన అన్నారు.


కరోనా కారణంగా ఇబ్బందులు ఉన్నా.. ఉద్యోగులకు ఉదారంగానే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా మన్నారు సజ్జల. చాలా అంశాల్లో ఉద్యోగ సంఘాలు అంగీకారానికి వచ్చాయని భావిస్తున్నామన్నారు. మళ్ళీ కలిసి పని చేస్తామని తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలతో ఫిట్మెంట్, ఐఆర్ రికవరీ, హెచ్ ఆర్ ఏ అంశాల తో పాటు చాలా అంశాలు మాట్లాడామని.. ఇవాళ మరోమారు చర్చలు జరిపి అపోహలు తొలగించే ప్రయత్నం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగుల తో మళ్ళీ కలిసి పని చేయాలన్నదే మా ఆకాంక్ష అని మంత్రి బొత్స అన్నారు.


పీఆర్సీ ని 5 ఏళ్ల కు తగ్గించే అంశాన్ని అంగీకారాన్ని తెలిపామని.. ఐఆర్ రికవరీ ని చేయకూడదని అడిగారని.. దానికీ అంగీకారం తెలిపామని సజ్జల అన్నారు. పీఆర్సీ సంబంధించిన ఉద్యోగ సంఘాలు ఇచ్చిన అంశాలపై పూర్తి స్ధాయి కమిటీ తో చర్చించామని అన్నారు. కొన్ని అంశాల్లో ఆర్ధిక శాఖ అధికారులు కొంత వివరణ ఇవ్వాల్సి ఉందని.. ఈ ఉదయం 10 గంటలకు మంత్రుల కమిటీ, మధ్యాహ్నం  మళ్ళీ ఉద్యోగ సంఘాలతో చర్చ ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.


చర్చలు జరిగినా ఇంకా పూర్తి ఫలితం రాలేదు కాబట్టి.. తమ పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. మంత్రుల కమిటీ తో చర్చలు సానుకూలంగా నే జరిగాయని... చర్చలు జరిగినా ఇంకా చాలా అంశాల్లో స్పష్ఠత రావాల్సి ఉందని వారు తెలిపారు. ఇవాళ, రేపు మా ఆందోళన కొనసాగుతుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: