దేవుడా.. గౌతమ్ రెడ్డి మరణంతోనూ రాజకీయాలా...?

ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి మొన్న అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే. వైసీపీ మంత్రుల్లో సౌమ్యుడిగా పేరున్న వ్యక్తి గౌతమ్‌రెడ్డి.. ఏమాత్రం వివాదాల జోలికి పోకుండా.. ఓ గౌరవనీయుడుగా పార్టీలకు అతీతంగా పేరు తెచ్చుకున్న వ్యక్తి.. ఒకరి జోలికి వెళ్లడం.. అధికార దర్పం ప్రదర్శించడం, నోటికి వచ్చినట్టు విమర్శలు చేయడం వంటి చిల్లర రాజకీయాలకు గౌతమ్‌ రెడ్డి ఆమడ దూరం ఉంటారు.. ఆగర్భ శ్రీమంతుడైనా సరే.. ఆ గర్వం కనిపించనీయరు.


అలాంటి వ్యక్తి హఠాత్తుగా మరణించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకే విపక్ష నేత చంద్రబాబు సైతం ఆయన ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. అయితే.. కొందరు రాజకీయ నాయకులు మాత్రం గౌతమ్‌ రెడ్డి మరణంతోనూ రాజకీయాలు చేయడం దుర్మర్గాంగా చెప్పుకోవచ్చు.. గౌతమ్‌ రెడ్డి మరణంపై అనుమానాలు ఉన్నాయని.. గౌతమ్‌ రెడ్డి మరణంపై సీబీఐతో విచారణ చేయించాలని కొందరు టీడీపీ నాయకులు డిమాండ్ చేయడం చూస్తుంటే రాజకీయాలు ఎంతగా దిగజారిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.


కనీసం గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు కూడా పూర్తి కాకుండానే టీడీపీ నేతలు కొందరు ఇలాంటి శవ రాజకీయం చేయడం నిజంగా దురదృష్ట కరమే.. సొంత కుటుంబ సభ్యులు కూడా వ్యక్తం చేయని అనుమానాలు ఈ నేతలు వ్యక్తం చేస్తున్నారంటే అది అనుమానం ఏమాత్రం కాదు.. ఆ పేరుతో కాస్తయినా రాజకీయ లబ్ది కలుగుతుందేమో అన్న ఆశ మాత్రమే. ఇలా డిమాండ్ చేయడమే కాదు.. కొందరు నేతలు, టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.


విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చేలా చూడాలని సీఎం జగన్ చేసిన ఒత్తిడి కారణంగానే గౌతమ్‌ రెడ్డికి గుండె పోటు వచ్చిందని కొందరు విద్యాధికులైన నాయకులు కూడా పోస్టులు పెడుతుండటం విచిత్రంగా చెప్పుకోవచ్చు. చిల్లర రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తుల జీవితాలపైన కూడా చిల్లర ఏరుకునే స్థాయి రాజకీయాలు చేయడంపై అన్ని పార్టీలు ఆలోచించడం మంచిది లేకపోతే.. రాజకీయాలు మరింత దిగజారే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: