జగన్ కొత్త కేబినెట్: ఆ కులం నుంచి ఆమే మొదటి మంత్రి?
మళ్లీ కొత్తగా కూడా 25 మంది వరకూ అవకాశం లభించవచ్చు. ఇలా కొత్తగా అవకాశం దక్కవచ్చని వినిపిస్తున్న పేరుల్లో పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే విడదల రజినీ ముందు వరుసలో ఉన్నారు. ఏ మాత్రం అనుభవం లేకుండా రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసి.. మొదటి సారే ఎమ్మెల్యేగా గెలిచింది విడదల రజిని. పాత గుంటూరు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్న చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి విడదల రజినీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
అయితే.. ఆమె రాజకీయ అరంగేట్రం మాత్రం మొదట తెలుగుదేశంతో ప్రారంభమైంది. తెలుగు దేశం పార్టీలో విడదల రజినీకి మంచి ప్రాధాన్యం దక్కినా ప్రత్తిపాటి పుల్లారావు ఉండటంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం రాదని ఆమె భావించారు. అందుకే సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఆమె వైసీపీలో చేరారు. వైసీపీ సీనియర్ నేతగా మర్రి రాజశేఖర్ ని కాదని మరీ జగన్ విడదల రజినికి అవకాశం ఇచ్చారు. అందుకు ప్రధాన కారణం ఆమె బీసి కావటం, ఆమె భర్త కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావడమని చెబుతారు.
విడదల రజినీ రజక సామాజిక వర్గానికి చెందినవారు. అసలు ఈ సామాజిక వర్గం నుంచి మంత్రి అయిన వారే లేరు. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు వరంగల్ జిల్లా వాసి బసవరాజు సారయ్య ఒక్కరే ఈ సామాజిక వర్గం నుంచి మంత్రి అయ్యారు. బీసీలోనే వెనుకబడిన కులంగా ఉన్న రజక సామాజిక వర్గం నుంచి మొదటి సారి మంత్రి అవుతారని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి విడదల రజినీకి అవకాశం దక్కుతుందో లేదో..?