అయ్యో సుచరిత.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా?

మేకతోటి సుచరిత.. ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి.. జగన్ అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్‌లో ఆమెకు హోంశాఖ అప్పగించారు. ఓ దళిత మహిళకు హోంశాఖ అప్పగించడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే.. అలాంటి సుచరితకు ఈసారి పునర్‌వ్యవస్థీకరణలో మళ్లీ అవకాశం దక్కలేదు. అయితే ఈ విషయం జగన్ ముందు నుంచి చెబుతూనే వస్తున్నారు. కానీ..తనతో పాటు ఉన్న దళిత మంత్రులందరినీ కొనసాగించి.. తనను ఒక్కదాన్నే తప్పించడం ఏంటన్నది ఆమె ఆక్రోశం.


అందులోనూ ఆమె జగన్ ఓ నాయకుడిగా పూర్తిగా అవతరించకముందే.. జగన్ వెంట నడిచిన నాయకురాలు. 2009లోనే ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత జగన్ కోసం రాజీనామా చేసిన నాయకురాలు. నిజమే.. ఆమె ఆవేదనలో అర్థం ఉండొచ్చు. కానీ.. జగన్ సంగతి తెలుసు కదా. ఏదైనా అభ్యర్థన తప్పించి.. రాజీనామా చేస్తా.. అంటూ ధిక్కార స్వరం వినిపిస్తే లాభం ఉంటుందా.. కానీ ఆమె ఆవేశంతోనే.. ఆవేదనతోనే.. రాజీనామా చేశారు. అనుచరులతో ఆందోళన చేయించారు.


కానీ.. ఈ విషయం తెలిసి జగన్ సీరియస్ అయ్యారు..తన దగ్గరకు పిలిపించుకుని క్లాస్  పీకినట్టు తెలుస్తోంది. పాపం.. అందుకే ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి అబ్బే నేను రాజీనామా చేయలేదు.. థ్యాంక్స్ చెబుతూ లెటర్ రాశాను.. ఆ విషయం మా పాపకు సరిగ్గా చెప్పడం రాలేదని కవర్ చేసుకోవాల్సి వచ్చింది. దీన్నే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు. ఇక ఇప్పుడు సుచరిత.. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైయస్‌ జగన్‌ వెంటేనని చెబుతున్నారు. దయచేసి తప్పుడు కథనాలు, పుకార్లకు స్వస్తి పలకండి అంటూ మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నారు.


థ్యాంక్స్‌ గీవింగ్‌ నోట్‌ను.. రాజీనామా లేఖ అంటే ఎలా అని మీడియాను ప్రశ్నిస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నన్ను సోదరిలా, కుటుంబ మనిషిగా భావిస్తారని.. రాజకీయాల నుంచి విరమించుకోవాల్సి వస్తే వైయస్‌ఆర్‌ సీపీ ఓటర్‌గానే ఉంటానని ఇప్పుడు చెబుతున్నారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో కొందరికి అవకాశం దక్కకపోవచ్చని సీఎం చెప్పినప్పుడు.. ఎలాంటి అభ్యంతరం లేదని తానే ముందుగా చెప్పానంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: