ఎల్లో మీడియాకు షాక్‌ ఇచ్చిన అనిల్‌, కాకాణి?

వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి, నెల్లూరు జిల్లా మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఇద్దరూ ఎల్లో మీడియాకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. కాకాణి మంత్రి అయినప్పటి నుంచి వీరిద్దరికీ నిమిషం పడట్లేదని జోరుగా పత్రికల్లో కథనాలు వచ్చాయి. చంద్రబాబు అనుకూల మీడియాలో అయితే వీరిద్దరూ ప్రత్యేక అతిధులు అయ్యారు. వీరి మధ్య విబేధాలను ఈ మీడియా బాగా హైలెట్ చేసింది. ఆ తర్వాత విషయం సీఎం జగన్ వరకూ వెళ్లింది. ఆయన పిలిచి క్లాస్ పీకిన విషయం కూడా బాగానే మీడియాలో హైలెట్ అయ్యింది.


మరి జగన్ క్లాస్ పీకినందుకో.. లేక.. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో తెలియదు కానీ.. నిన్న ఓ అపురూప దృశ్యం సాక్షాత్కారమైంది. మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. మంత్రిగా తొలిసారి తన ఇంటికి వచ్చిన కాకానికి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కూడా ఘనంగా స్వాగతం పలికారు. వీరిద్దరి భేటీలో జిల్లా రాజకీయాలతో పాటు, పార్టీని పటిష్టం చేయడంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.


రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ గెలుపుకోసం సాయశక్తుల పనిచేస్తామని మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కలిసి చెప్పారు. కొన్నిరోజులుగా వైయ‌స్ఆర్‌సీపీలో విభేదాలు వీధిన పడ్డాయని జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇలా ఇప్పుడు వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమలు కురిపించుకోవడం చూసి.. తెలుగు తమ్ముళ్లు డీలా పడిపోయారనే చెప్పాలి. తాజా, మాజీ మంత్రుల కలయికతో తెలుగు తమ్ముళ్లతో పాటు టీడీపీ అనుకూల మీడియా కూడా కంగుతిందని చెప్పొచ్చు. అయితే.. తమది మర్యాద పూర్వక భేటీ అంటున్నారు వీరిద్దరు.


జిల్లాలో అందరినీ కలుపుకొని పోతామని.. సీఎం వైయ‌స్ జగన్ జనబలాన్ని రెట్టింపు చేస్తామని తాజా, మాజీ మంత్రులు ఘంటాపథంగా చెబుతున్నారు. తన ఇంటికి కాకాణి రాక సందర్భంగా అనిల్ యాదవ్ ఆయనకు శాలువా కప్పడం.. ఆ తర్వాత మంత్రి కాకాణి అనిల్ యాదవ్‌కు శాలువా కప్పి పూల గుచ్ఛం ఇవ్వడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాపం. ఇలాంటి దృశ్యాలు చూసి జీర్ణించుకోవడం టీడీపీ అనుకూల మీడియాకు కాస్త కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: