ఆ రంగంలో ఇండియా- రష్యా దూసుకుపోతున్నాయా?
రక్షణ రంగాన్నిబలోపేతం చేసుకునేందుకు భారత్-రష్యా కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. తాజాగా ధ్వని వేగం కంటే 5 రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగాల్లో ఈ రెండు దేశాలు ముందడుగు వేస్తున్నాయి. రష్యా సహకారంతో హైపర్ సోనిక్ క్షిపణులు మరో ఐదారేళ్లలో దేశీయంగా తయారు చేస్తామని మన దేశానికి చెందిన బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ వెల్లడించింది. ధ్వని కంటే 5 రెట్ల వేగంతో దూసుకెళ్లడం ఈ హైపర్ సోనిక్ క్షిపణుల ప్రత్యేకత.
ఇప్పటి వరకూ ఈ క్షిపణులను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. కానీ ఇప్పుడు రష్యా సాయంతో ఈ క్షిపణులను మరో ఐదారేళ్లలో దేశీయంగానే తయారు చేస్తామని బ్రహ్మోస్ ఏరోస్పేస్ చెబుతోంది. హైపర్ సోనిక్ మిస్సైళ్లను తయారు చేసే సామర్థ్యం త్వరలోే బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంపాదిస్తుందని ఆ సంస్థ చెబుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ, వేగవంతమైన, అత్యంత శక్తివంతమైన, కచ్చితత్వమైన ఆధునిక ఆయుధాల్లో ఈ బ్రహ్మోస్ క్షిపణులు ఒకటి. అందుకే దానికి అంత ప్రాధాన్యం.
మేక్ ఇన్ ఇండియా, డిజైన్ ఇన్ ఇండియా నినాదాలతో ఇప్పుడు బ్రహ్మోస్ ఏరోస్పేస్ దేశీయంగానే హైపర్ సోనిక్ క్షిపణుల తయారీకి పూనుకుంది. ఈ హైపర్ సోనిక్ ఆయుధాలు రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో ఉత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. ఈ బ్రహ్మోస్ హైపర్సోనిక్ క్షిపణులు దేశీయంగా అందుబాటులోకి వస్తే ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణ వ్యవస్థ కలిగిన దేశాల సరసన భారత్ కూడా సగర్వంగా నిలబడుతుంది. మనం తయారు చేసుకోవడమే కాదు.. ఇతర దేశాలకూ ఎగుమతి చేసేలా బ్రహ్మోస్ ప్రణాళికలు రూపొందిస్తోంది.