కేసీఆర్పై కురుక్షేత్రం చేస్తా.. క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి?
ఆయన ఏమంటున్నారంటే.. టీఆర్ఎస్ రాక్షస పాలన నుంచి విముక్తి చేసే దిశగా నేను అడుగులు వేస్తున్నా...రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు. నేను మొదటి నుంచి చెబుతున్న విషయంలో డైలమా, వెనకడుగు నారక్తంలోనే లేదంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇది నా సొంత అవసరాల కోమో...పదవుల కోసమో చేస్తున్న పోరాటం కాదంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇప్పటికే సన్నిహితులు, ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులతో అన్ని విషయాలు చర్చించే.. కేసీఆర్ పాలనపై సమరశంఖం పూరించాలని నిర్ణయించానంటున్నారు.
మునుగోడు నియోజక వర్గ ప్రజలు, మేధావులు, కవులు, కళాకారులు, యువజన, విద్యార్ధి, ఉద్యోగవర్గాలన్నీ తన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. త్వరలో మరింత విస్తృత సంప్రదింపులు చేసి మునుగోడు నియోగవర్గ అభివృద్ది, కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడేందుకు కురు క్షేత్ర యుద్దానికి సైరన్ పూరిస్తానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటన కాస్త క్లారిటీగానే ఉన్నా.. ఇంకా అనేక విషయాల్లో స్పష్టత రావాల్సి ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి అన్నదమ్ములిద్దరూ కాంగ్రెస్ను వీడతారా.. లేక ప్రస్తుతానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే బీజేపీలోకి వెళ్తారా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఆ పార్టీకి ఊపు తీసుకొచ్చే అవకాశం ఉంది. బీజేపీ కేడర్ పెద్దగా లేని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇది ఆ పార్టీకి లాభించే అంశమే.