టీ కాంగ్రెస్‌కు కలిసొస్తున్న కాలం.. అధికారం ఖాయం?

ఎన్నికల వేళ అన్ని మంచి శకునములే ఎదురవుతాయనుకుంటున్న కేసీఆర్ కు.. వరుసగా అపశకునాలు షాక్ ఇస్తున్నాయి. ఎన్నికల రేసులో అందరి కంటే ముందు ఉందామని అభ్యర్థుల్ని ప్రకటించిన గులాబీ బాస్ తర్వాత ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రచారంలో కూడా రోజుకి మూడు, నాలుగు సభలు పెడుతూ దూసుకుపోతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా..క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి.


కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను కాపీ కొట్టారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇది జనంలోకి కూడా బాగా వెళ్లిపోయింది. అలాగే కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏదైతే తమకు బలం అని ప్రచారం చేసుకుంటున్నారో అదే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్య శ్యామలం అయిందని.. దేశంలో పంజాబ్ తర్వాత తెలంగాణలోనే ధాన్యం ఎక్కవగా పండుతోందని చెబుతున్నారు. సరిగ్గా ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగింది.



వారంలో అన్నారం బ్యారేజీకి బుంగలు పడ్డాయి. సుందిళ్ల బ్యారేజీకి కూడా ముప్పు ఉందని ప్రాజెక్టు అథారటీ ప్రకటించింది. ఈ నివేదికలే ప్రత్యర్థి పార్టీలకు ప్రచార అస్త్రాలుగా మారాయి. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ఈ అంశంపైనే బీఆర్ఎస్ సర్కారు ను ఇరుకున పెడుతున్నాయి. ఈ అంశాన్ని క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా యత్నిస్తోంది.


ముఖ్యంగా రాహుల్ గాంధీ మేడిగడ్డను సందర్శించి దీనిపై పలు సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎం లా మారిందని ఒక ఏటీఎం ను సైతం ఏర్పాటు చేశారు. అంతే కాదు ఇందులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది అని తమ ప్రభుత్వం రాగానే అవినీతి సొమ్మంతా కక్కిస్తామని చెబుతున్నారు. కేసీఆర్ పనితీరుకు కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరే నిదర్శనమని మళ్లీ గెలిపిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిని ఎంత కవర్ చేసేందుకు యత్నిస్తున్నా.. బీఆర్ఎస్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బ కానుందనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: