కేసీఆర్‌ను భయపెడుతున్న రేవంత్‌, ఈటల?

ప్రస్తుతం తెలంగాణలో రెండు చోట్ల పోటీ చేసే రాజకీయం నడుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి లో పోటీ చేస్తుండగా.. బీజేపీ ముఖ్య నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ తో పాటు, గజ్వేల్ లో పోటీ చేయనున్నారు. ఇప్పుడు తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేయబోతున్నారు.


అయితే ఇటీవల కామారెడ్డి లో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడుతూ.. కొడంగల్ లో చెల్లని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో గెలుస్తాడా.. దమ్ముంటే కేసీఆర్ పై పోటీ చేయాలని సవాల్ విసిరారు.  రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. తమ పార్టీ పై చేయి సాధించడానికి పై తరహా విమర్శలు చేస్తుంటారు. అయితే కొడంగల్ లో ఓడిపోయిన కొద్ది నెలలకే దేశంలోనే అతి పెద్దదైన మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. కాబట్టి రాజకీయాల్లో గెలుపోటములు సహజం.


గత ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఈ ఎన్నికల్లో గెలవచ్చు. గతంలో గెలిచిన వారు ఇప్పుడు ఓడిపోవచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.  ఒక ఎన్నికకు మరో ఎన్నికకు సంబంధం ఉండదు. ఉదాహరణకు తీసుకుంటే దుబ్బాక, హుజూరాబాద్ లు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు. అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోలేదా..?


గజ్వేల్ లో ఓడిపోతారనే భయంతోనే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు అని  ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతేడాది లోక్ సభ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఓడి పోయింది. ఒక్కసారి ఓడి పోయారు కాబట్టి ఇంక ఎన్నికల్లో పోటీ చేయరా..  ఇక రెండు చోట్ల పోటీ విషయానికొస్తే ఆయా ముఖ్య నేతలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేయకుండా ఆ నియోజక వర్గాలకే పరిమితం చేసేలా ఆయా పార్టీలు పన్నుతున్న వ్యూహాలివి.  చూద్దాం ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడిపోతారో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: