తెలుగుదేశానికి పవన్ డెడ్ లైన్ పెట్టేశాడా?
ఫిబ్రవరి 5లోపు మాకిచ్చే సీట్లపై స్పష్టత ఇవ్వండి అని నాదెండ్ల మనోహర్ ద్వారా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుని అడిగించారు. ఓ రకంగా చెప్పాలంటే ఇది డెడ్ లైన్ అనే చెప్పవచ్చు. ఇప్పటికే ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి.. ఏఏ సీట్లలో పోటీ చేయాలనే అంశంపై ప్రాథమికంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పలుమార్లు భేటీ అయి ఓ స్పష్టతకు వచ్చారు. అయితే బీజేపీతో జనసేన చర్చలు జరుపుతోంది. దీంతోనే ప్రక్రియ ఆలస్యం అవుతుందనే టాక్ వినిపిస్తోంది.
అయితే ప్రచార సభల్లో భాగంగా చంద్రబాబు రెండు సీట్లను ప్రకటించడం జనసేన పార్టీలో భిన్నాభిప్రాయాలకు కారణం అయింది. పొత్తులో ఉండి ఇలా ఏకపక్షంగా సీట్లను ప్రకటించడం ఏంటని అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జనసేన కూడా తాము పోటీ చేసే రెండు సీట్లను ప్రకటించింది.
పొత్తు ప్రకటించిన సందర్భంలో ఆ తర్వాత కూడా పలు ప్రెస్ మీట్లలో టీడీపీ,జనసేన కలిసే రాజకీయ కార్యక్రమాలు చేపడతాయి అని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. చంద్రబాబు ప్రస్తుతం నిర్వహిస్తున్నా రా కదలిరా సభలో పవన్ కల్యాణ్ ఎక్కడా కనిపించడం లేదు. అలాగే నారా లోకేశ్ యువగళం ముగింపు పాదయాత్ర సభకు కూడా ముందు పవన్ కల్యాణ్ రానన్నారు. ఆ తర్వాత చంద్రబాబుతే భేటీ తర్వాత బహిరంగ సభకు రావడానికి ఒప్పుకున్నారు. ప్రస్తుతం రాకపోవడానికి సీట్ల సంఖ్య తేలకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలోపు స్పష్టత ఇవ్వాలని జనసేన డిమాండ్ చేసిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.