పౌరసరఫరాలు.. టెండర్లలో ఎన్నో అక్రమాలు.. రేవంత్ ఓ కన్నేస్తే బెటర్?
లంచాలు ఇచ్చి సహకరిస్తే సరి... లేదంటే వేధిస్తామని మిల్లర్లను బ్లాక్ మెయల్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ మండిపడ్డారు. బ్రూ ట్యాక్స్ కట్టిన వాళ్లకు మాత్రమే క్లియరెన్స్ ఉత్తర్వులు ఇస్తున్నారని... అధికారికంగానే కుంభకోణం జరిగిందని సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఇంత జరుగుతోంటే విజిలెన్స్ విభాగం, ఏసీబీ ఏం చేస్తున్నాయని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ ప్రశ్నించారు. బట్టలు ఊడదీసినట్లు కుంభకోణం బయటపడిందని, అయినా కాంగ్రెస్ పార్టీ ఇంకా సమర్థించుకుంటోందని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ ఆక్షేపించారు.
అన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా స్పందించడం లేదంటే అందరికీ తెలిసే జరిగిందన్న బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్... సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదంటే సీఎంఓ కు తెలిసే జరిగినట్లుందని ఆరోపించారు. టెండర్ దక్కించుకున్న నాలుగు సంస్థలు విశాఖలో ప్రత్యేక ఖాతాలు తెరిచి, మిల్లర్లు ద్వారా డబ్బులు వేయించుకుంటున్నాయట. ఒప్పందం కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తూ దాదాపు 700 కోట్ల లంచాన్ని ఆ ఖాతాలకు మళ్లిస్తున్నారట.
మే 15 వరకు సీఎంఆర్ తీసుకుంటామని ఎఫ్ సీ ఐ హామీ ఇచ్చినా జనవరి 25 వ తేదీనే ఎందుకు టెండర్లు పిలిచారని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ ప్రశ్నించారు. బిడ్డర్, మిల్లర్ మధ్య లావాదేవీలతో మాకేం సంబంధం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారంటే అక్రమాలను అంగీకరించినట్లే కదా అని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ వ్యాఖ్యానించారు. సన్నబియ్యం టెండర్లలో ముందుకు పోలేదని మంత్రి చెప్తున్నారని... కానీ, ఎల్జీ ఇండస్ట్రీస్ కు పౌరసరఫరాల సంస్థ ఎండీ ప్రొసీడింగ్స్ ఇచ్చారని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ పేర్కొన్నారు.