ప్రభుత్వోద్యోగులు.. పార్టీలు.. ఈ వింత ఏపీలోనే సాధ్యం గురూ?

ఏపీలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. వైసీపీ నేతల ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకునే పనిలో పడ్డారు. అయితే గత ఐదేళ్లుగా వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తిన అధికారులు మాత్రం ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. కొత్త ప్రభుత్వంలో సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే వారు చేసింది తప్పులే అనుకుంటే పొరపడినట్టే. అంతకు మించి రాజకీయ ప్రత్యర్థులను వేధించడంలో సైతం ముందంజలో ఉండేవారు. అలాంటి వారిని గుర్తించి దూరం పెట్టే పనిలో పడ్డారు కూటమి నేతలు. సహజంగా రాజకీయ పార్టీలకు కార్యకర్తలు, నాయకులు ఉంటారు. అయితే అధికారం.. లేకపోతే ప్రతిపక్షంలో కూర్చొంటారు. ఇదే క్రమంలో మీడియా కూడా రెండు ముక్కలుగా విడిపోయింది. వైసీపీకి అనుకూలంగా కొన్ని పత్రికలు, న్యూస్ ఛానళ్లు పనిచేస్తే.. టీడీపీకి మరికొన్ని పేపర్లు, టీవీలు పనిచేసి పెట్టేవి.

ఇప్పుడు పంథా మారింది. అధికారులకు కూడా పార్టీ మరకలు అంటుతున్నాయి. చంద్రబాబు ఐఏఎస్ లు, జగన్ ఐఏఎస్ లు అన్న చందంగా తయారైంది ఏపీ పరిస్థితి. ఎవరు అధికారంలో ఉంటే వారు పార్టీకి విధేయులగా ఉండే వారిని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టేవారు. అయితే గత ప్రభుత్వంలో తమను ఇబ్బంది పెట్టిన వారిని కూటమి నేతలు గుర్తించే పనిలో పడ్డారు.  వారిని ఆయా  బాధ్యతల నుంచి తప్పించి బదిలీలు చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి.

ఇప్పుడు ఉద్యోగుల వంతు వచ్చింది. అంటే ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, డీటీలు, ఇలా .  వీరంతా  గత వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని కొంత మంది సహచరులు టీడీపీకి, జనసేనలకు సమాచారం ఇస్తున్నారు. తాజాగా వీరిని కూడా పక్కన పెట్టే ఉద్దేశంలో అధికార పార్టీ నేతలు ఉన్నారు. ఎవరికి అయితే ప్రమోషన్లు, డిప్యూటేషన్లు, బదిలీలు జరిగాయో వారిని గుర్తించేందుకు సిద్దం అయ్యారు. వాస్తవానికి ఈ స్థాయి ఉద్యోగులకు రాజకీయాలతో సంబంధం ఉండదు. ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా పనిచేసి పెట్టాలి. లేకపోతే బదిలీలు, ప్రాధాన్యం లేని శాఖలు వస్తుంటాయి. కానీ ఈ పార్టీ ముద్రల ద్వారా ఉద్యోగులు కూడా నష్టపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: