అమరావతిలో ఇంకా భూములు తీసుకుంటారా?
అయితే భూ సమీకరణ పేరుతో రైతులు, ప్రభుత్వ స్థలాల నుంచి 55 వేల ఎకరాలను సేకరించింది. అయినా టీడీపీ అనుకున్న విధంగా రాజధాని అమరావతిలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగించలేకపోయింది. కారణం సీడ్ యాక్సెస్ రోడ్డు వేయకపోవడం. అంటే అమరావతిలోకి ఎంటర్ అయ్యే రోడ్డు నిర్మాణం లేకపోవడం. దీనికి కారణం అక్కడి స్థానిక రైతులు కోర్టుల్లో కేసులు వేయడమే. ఆ తర్వాత ప్రభుత్వం రావడం.. జగన్ మూడు రాజధానుల అంశాలను తెరపైకి తేవడంతో అమరావతి అంశం కనుమరుగు అయింది.
అయితే ఇప్పుడు మళ్లీ ఎన్నికైన టీడీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు భూ సేకరణతో పాటు వాటిని తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా మంత్రి నారాయణ కేసులు వేసిన వారితో సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో రైతులు తమకు గతంలో నాటి టీడీపీ ప్రభుత్వం 1200 గజాలు, 1400 గజాలు చొప్పున ప్లాట్లు ఇస్తామని చెప్పింది. ఇప్పుడు దీనికి మేం ఒప్పుకోవాలంటే మాకు 2000 గజాల ప్లాట్లు ఇవ్వాలని కొంతమంది, 2500 గజాల ప్లాట్లు కావాలని మరికొంత మంది డిమాండ్ చేశారు.
అలా ఇస్తే.. మిగతా వారు కూడా తమకు అంతే ప్లాట్లు ఇవ్వాలని పట్టుబడతారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక ప్రభుత్వం డైలమాలో పడింది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఏడువేల ఎకరాల భూమి మాత్రమే ఉంది. మిగతా భూమిని అంతా వివిధ రంగాలకు, కంపెనీలకు కేటాయించేశారు. మిగిలిన ఏడువేల ఎకరాలను విక్రయించి డబ్బులు సమకూర్చుకోవాలని కూటమి సర్కారు యోచిస్తోంది. ఆ రైతులకు మధ్యే మార్గంగా ఎకరం భూమి ప్రస్తుత రిజిస్ర్టేషన్ వాల్యూ ఎంత ఉందో దానికి మూడు రెట్లు ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.