ఆ విషయంలో చంద్రబాబుని ఫాలో అవుతున్న జగన్..?

రాజకీయాల్లో ప్రత్యర్థుల నుంచి ఇంపుట్స్ కూడా తీసుకుంటూంటారు. అవి అవసరం అయినపుడు వాడుతూంటారు. రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు తన పార్టీని 2019 నుంచి 2024 వరకూ అయిదేళ్ళ పాటు ఎలా కాపాడుకున్నారో అందరికీ తెలిసిందే. జగన్ 151 సీట్లతో గెలిచిన మరుసటి రోజు నుంచే అదిగో ఎన్నికలు ఇదిగో ఎన్నికలు అంటూ క్యాడర్ ని ఉత్తేజపరిచారు.



వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని కూడా చెబుతూ వచ్చేవారు. మూడు రాజధానుల మీద కోర్టులో ఇబ్బంది అయితే జగన్ అసెంబ్లీ రద్దు చేస్తున్నారని ప్రచారం కూడా అప్పట్లో సాగింది. ఇక దేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా దానితో ఏపీని ముడి పెట్టి అక్కడా ఇక్కడా ఒకేసారి ఎన్నికలకు జగన్ పావులు కదుపుతున్నరని కూడా ప్రచారం సాగింది. ఆఖరుకు తెలంగాణా ఎన్నికల్లో కూడా ఏపీని కలిపి జగన్ నిర్వహిస్తారు అని చెప్పుకొచ్చారు.


అయితే అవేమీ జరగలేదు కానీ టీడీపీ మాత్రం ఉత్తేజం అవుతూ వచ్చింది. ఎపుడు ఎన్నికలు జరిగినా పార్టీ సిద్ధంగా ఉండాలని నాడు చంద్రబాబు పార్టీ మీటింగ్స్ లో తరచూ చెప్పే మాటగా ఉండేది. దాంతో ఎన్నికలు వస్తాయి కదా అని నేతలు జనంలోకి వచ్చేవారు. క్యాడర్ కూడా అయిదేళ్ళూ రోడ్డు మీదనే ఉంది. ఇపుడు ఆ స్ట్రాటజీనే తిరిగి జగన్ వాడేస్తున్నారు.



ఆయన లేటెస్ట్ గా తాడేపల్లిలో జరిగిన పార్టీ మీటింగులో నేతల్తో ఇదే మాట చెప్పారు. జమిలి ఎన్నికలు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దాని మీద స్టడీ చేస్తోంది. దాంతో ఎన్నికలు ఎపుడైనా రావచ్చు అని జగన్ ఒక కీలక సందేశం పార్టీకి ఇచ్చారు.

ఎన్నికలు ఎపుడు వచ్చినా కూడా నేతలు అంతా సిద్ధంగా ఉండాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. ముందస్తు ఎన్నికలు అదిగో వచ్చేస్తున్నాయని కూడా ఆయన ప్రకటించేస్తున్నారు. ఎన్నికలు ఎపుడు వచ్చినా వైసీపీదే విజయం అని కూడా ఆయన ధీమాగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధం అవుతోంది అని వస్తున్న వార్తలతో వైసీపీ అలెర్ట్ అవుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: