ఆగ‌స్టు నుంచి ఏపీ జ‌నాల‌కు పండ‌గ .. చంద్ర‌బాబు మార్క్ పాల‌న‌... !

RAMAKRISHNA S.S.
- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు నెల నుంచే పండగ వాతావరణం తీసుకొచ్చేలా భారీగా సంక్షేమ పథకాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని పథకాలు అమలులో ఉన్నా ఆగస్టు 15వ తేదీ నుంచే మరిన్ని కీలకమైన కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో పాపుల‌ర్ స్కీం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. రాష్ట్రంలోని ఐదు రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ పథకం వల్ల ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ప్రయాణ ఖర్చు నుంచి ఉపశమనం లభించనుంది. పల్లె వెలుగు, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు మరో రెండు రకాల బస్సుల్లో కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. మంత్రి అచ్చం నాయుడు ప్రకటన మేరకు, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది.


ఇది మహిళల ఓట్లను కూటమి వైపుకి మళ్లించేలా పనిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, రైతుల కోసం ముఖ్యమైన అన్నదాత సుఖీభవ పథకం కూడా ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని గత ఏడాది నుంచే ప్రారంభించాలని భావించినా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఈ సమయంలో రైతులకు ఆర్థిక సాయం అందించాలన్నదే లక్ష్యంగా ఈ పథకం అమలుకి రెడీ అవుతున్నారు. 13 నెలలుగా ఎదురుచూస్తున్న రైతులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. పంటల సాగులో అప్పుల భారం ఉన్న రైతులకు ప్రభుత్వం ఇచ్చే ఈ సాయం ఎంతో అవసరం. ఇది స‌క్సెస్ అయితే ప్రభుత్వంపై రైతుల విశ్వాసాన్ని పెంచే అవకాశం కలిగిస్తుంది.


వితంతు పింఛన్ల పునరుద్ధరణ కూడా మరో ముఖ్యమైన కార్యక్రమం. గత ప్రభుత్వ హయంలో కొందరి వితంతు పింఛన్లు రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పుడు వాటిని తిరిగి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పలువురికి ఉపశమనం కలిగించనుంది. ఇది సామాజిక న్యాయ పరంగా కూడా మంచి రెస్పాన్స్‌ తెచ్చే అవకాశం ఉంది. ఈ పథకాలతో పాటు సేవలను డిజిటలైజ్ చేయడం కూడా ముఖ్యాంశం. ఆగస్టు 15 నుంచి ప్రభుత్వ సేవలన్నింటినీ వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్ల ద్వారా అందుబాటులోకి తేచేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ఇంటి వద్ద నుంచే సేవలు పొందే అవకాశం ఉంటుంది. ఆగస్టు నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాల పండుగ మొదలుకానుంది. మహిళలు, రైతులు, వృద్ధులు, వితంతువులకు లబ్ధి చేకూరేలా రూపొందించిన ఈ పథకాలు ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వం ప‌ట్ల పాజిటివ్‌నెస్ పెరిగేందుకు కార‌ణ‌మ‌వుతాయ‌న్న అంచ‌నాలు ఉన్నాయి.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: