వైసీపీలో ఖాళీలు ... జగన్ ఎప్పటకీ భర్తీ చేస్తారో...?
గుంటూరు నుంచి పోటీ చేసిన నేత జనసేనలో చేరారు. మచిలీపట్నంలో వైసీపీ తరఫున ముందుండే నాయకులు మౌనంగా ఉన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పార్టీ జెండా మోసే నేతలే కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇక నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసిన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ తిరిగి తన అసెంబ్లీ నియోజకవర్గం వైపు దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేయనని, నెల్లూరు సిటీలోనే కొనసాగుతానని ఆయన చెబుతున్నట్టు సమాచారం. అలాగే చీరాల, మాచర్ల నియోజకవర్గాల్లోనూ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మాచర్లలో వచ్చే ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయకపోవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన సతీమణి బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
ఇలా ఒకటి కాదు… రెండు కాదు… చాలా నియోజకవర్గాలు ఖాళీగా ఉండటం వైసీపీకి పెద్ద మైనస్గా మారింది. మరీ ముఖ్యంగా పార్టీ అధినేత జగన్ నివసించే ప్రాంతానికి సమీపంలోనే రెండు మూడు నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లేకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంగళగిరి, రేపల్లె వంటి చోట్ల పార్టీని ముందుండి నడిపించే నేతలే లేరు. ఇంతటి పరిస్థితుల్లో ఈ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు? పార్టీని మళ్లీ లైన్లో పెట్టేది ఎప్పుడు? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. అయితే ఈ అంశాలపై అధినేత స్థాయిలో ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు. అంతేకాదు… ఈ ఖాళీ పోస్టుల కోసం ముందుకు వచ్చే నాయకులు కూడా లేకపోవడం మరో విశేషంగా మారింది. ఇది వైసీపీ భవిష్యత్తుకు మరింత సవాలుగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.