2026 న్యూ ఇయ‌ర్ గిఫ్ట్‌... ప‌వ‌న్ స్టైలే వేరు...!

RAMAKRISHNA S.S.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఒక గొప్ప ముందడుగు వేశారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణుల మరణాలకు మరియు గర్భస్రావాలకు ప్రధాన కారణంగా మారుతున్న సికిల్ సెల్ ఎనేమియా మహమ్మారిని అరికట్టేందుకు ఆయన నూతన సంవత్సర కానుకగా అరకులో అత్యాధునిక బ్లడ్ బ్యాంక్ భవన నిర్మాణాన్ని ప్రకటించారు. ఇటీవల అరకు నియోజకవర్గంలోని కురిడీ గ్రామంలో నిర్వహించిన ‘అడవితల్లి బాట’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన 'మాటా-మంతి'లో ఒక గిరిజన మహిళ తమ ప్రాంతంలో సికిల్ సెల్ ఎనేమియా వల్ల మహిళలు పడుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. జన్యుపరమైన ఈ వ్యాధి వల్ల రక్తహీనత ఏర్పడి, గర్భిణులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి గోడును విన్న పవన్, దీనికి శాశ్వత పరిష్కారం చూపుతానని అక్కడికక్కడే హామీ ఇచ్చారు.


అరకులో అత్యాధునిక బ్లడ్ బ్యాంక్ :
వైద్య నిపుణులతో చర్చించిన అనంతరం, సికిల్ సెల్ బాధితులకు క్రమం తప్పకుండా జరిగే రక్త మార్పిడి  ఒక్కటే తక్షణ ఉపశమనమని పవన్ గుర్తించారు. అరకు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోనే ఈ బ్లడ్ బ్యాంక్ భవనాన్ని నిర్మించనున్నారు. ఇందులో అత్యధిక మొత్తంలో రక్త నిల్వ సామర్థ్యంతో పాటు, రక్తాన్ని విభజించే అధునాతన యంత్రాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు.


ఆసుపత్రికి అనుసంధానం:
నిర్మాణం పూర్తయిన తర్వాత దీనిని అరకు ఏరియా ఆసుపత్రికి అనుసంధానం చేస్తారు. దీనివల్ల అత్యవసర సమయంలో రక్తం కోసం మైదాన ప్రాంతాలకు (విశాఖపట్నం వంటి నగరాలకు) వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 1,500 మంది సికిల్ సెల్ ఎనేమియా బాధితులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సమయానికి రక్తం అందడం వల్ల గర్భిణుల మరణాల రేటు గణనీయంగా తగ్గుతుంది.
పేద గిరిజనులకు ఉచితంగా రక్త మార్పిడి సదుపాయం అందడం వల్ల వారిపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుంది.
మాట ఇవ్వడమే కాదు, దానిని చేతల్లో చూపించి పవన్ కళ్యాణ్ గిరిజన బిడ్డల పట్ల తనకున్న మక్కువను చాటుకున్నారు. ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు అరకు ప్రాంత గిరిజన మహిళల ఆరోగ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: