తేడా తెలుసుకో.. జగన్: హెరిటేజ్ వార్నింగ్ ..!
ఏం జరిగింది?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయం ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదంలో కొవ్వులు కలిశాయని.. కల్తీనెయ్యి వినియోగించారని.. అసలు పాలేలేకుండా.. నెయ్యిని తయారు చేశారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను నాయకులు ఉటంకిస్తున్నారు. దీనిలో ప్రధానంగా ``భోలే బాబా ఆర్గానిక్ మిల్క్`` సంస్థ తప్పులు చేసినట్టు తెలిపింది. దీనినే ప్రధమ నిందిత సంస్థగా సిట్ అధికారులు పేర్కొన్నారు.
జగన్ మీడియా ఏమందంటే..
ఈ వ్యవహారం కొనసాగుతున్న సమయంలోనే.. జగన్కు చెందిన మీడియా.. మరో వాదనను తెరమీదికి తెచ్చింది. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ కూడా.. ``భోలే బాబా`` సంస్థల నుంచే పాలను సేకరించిందని.. పెరుగు కూడా ఈ పాలతోనే తయారు చేస్తోందని ఆరోపించింది. దీనిపై గత రెండు రోజులుగా వార్తలను ప్రచారం చేస్తోంది. ఈ వ్యవహారంపైనే హెరిటేజ్ రియాక్ట్ అయింది. తేడా తెలుసుకోవాలి.. అంటూ వార్నింగ్ ఇచ్చింది.
ఏంటా తేడా..!
భోలే బాబాకు చెందిన సంస్థలు.. ఒకటి కాదని.. రెండు ఉన్నాయని హెరిటేజ్ పేర్కొంది. 1) భోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ (రాజస్థాన్) ప్రైవేట్ లిమిటెడ్, 2) భోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ (ఉత్తరా ఖండ్) ఉన్నాయని తెలిపింది. ఈ రెండింటిలో తాము రాజస్థాన్లోని భోలే బాబా సంస్థకు చెందిన ఉత్పత్తులను వినియోగిస్తున్నమాట వాస్తవమేనని పేర్కొంది. కానీ.. దీనిని వక్రీకరిస్తూ.. తాము ఉత్తరాఖండ్లోని ప్రస్తుత తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీకి బాధ్యులైన భోలే బాబా సంస్థ నుంచి పాల పదార్ధాలను సేకరిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఈ విషయంలో జగన్ ఆయన మీడియా చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని తెలిపింది.