రాష్ట్రంలో గత కొంత కాలంగా ఉన్న అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని కోరుతూ..ఈనెల 10న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఉమ్మడిగా బంద్కు పిలుపునిచ్చాయి. గత ప్రభుత్వాలు విద్యార్థుల సమస్యల పట్ల ఏమాత్రం దృష్టి పెట్టలేదని..ఇప్పుడున్న ప్రభుత్వం వారి బాటలోనే నడుస్తుందని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని, వసతి గృహాల విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని మూడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని తాము గురువారం ఈ బంద్కు పిలుపునిచ్చామని ఆయా విద్యార్థి సంఘాలు తెలిపాయి.
అంతే కాదు విద్యార్థులు సరిగా రావడం లేదని ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ప్రతిపాధన ప్రభుత్వం తీసుకుంటుందని ఇలా చేస్తే ఎంతో మంది విద్యార్థులు రోడ్డున పడతారని వారు అంటున్నారు. ఇక నారాయణ, శ్రీచైతన్య జూనియర్ కళాశాలల్లో ప్రతి సంవత్సరం కొంత మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని..కార్పోరేట్ కశాశాలల యాజమాన్యం ర్యాంకుల కోసం చేసే వేధింపులు భరించలేకపోవడమే కారణమని పేర్కొంటూ విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయి విచారణకు డిమాండ్ చేస్తున్నాయి.
ఇంటర్మీడియేట్ చదువుకు నీరజారెడ్డి కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1800 పోస్టులకు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, పిడిఎస్యు, పిడిఎస్ఒ, పిడిఎస్యు నాయకులు తెలిపారు.