గవర్నర్ జోక్యం చేసుకుని ఎస్వీ యూ ప్రతిష్ట కాపాడాలి
ఎస్వీ యూనివర్సిటీ లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై రాష్ట్ర గవర్నర్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని విద్యావేత్తలు అంటున్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఎస్వీ యూనివర్సిటీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ప్రస్తుత ఉన్న ఇంచార్జి రిజిస్ట్రార్ వల్ల యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారుతోంది పలువురు విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది విద్యావేత్తలను , మేధావులను ఈ సమాజానికి అందించిన ఎస్వీ యూనివర్సిటీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘన కీర్తి ఉందని… కానీ ఇటీవల యూనివర్సిటీ లో చోటు చేసుకుంటున్న సంఘటనలు అపఖ్యాతి తెచ్చేవిగా ఉంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
పరీక్షల నిర్వహణ నుంచి మొదలుకుని ఫలితాల వెల్లడిలో దొర్లుతున్న తప్పిదాల వరకు , విద్యార్థులను ఆత్మహత్య లు చేసుకునేలా పురిగొల్పేలా ఉన్న యూనివర్సిటీ యాజమాన్య వ్యవహారశైలి వల్ల.. యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటోందని అంటున్నారు . ఇటీవల ఒక వికలాంగున్ని నిర్బంధించి ఇంచార్జ్ రిజిస్టార్ ఆయన సహచరులు తమకు అనుకూలమైన పత్రాలపై సంతకం పెట్టించుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జోక్యం చేసుకుని తప్పులను సరిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలోని యూనివర్సిటీలన్ని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు కావడం ... అవన్నీ గవర్నర్ పర్యవేక్షణలో తమ కార్యకలాపాలు కొనసాగిస్తుండడం వల్ల బిశ్వభూషణ్ హరిచందన్ నేరుగా జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఒక వికలాంగుని అరగంటపాటు నిర్బంధించి తమ చర్యల ద్వారా వేధింపులకు గురి చేసిన ఇంచార్జ్ రిజిస్ట్రార్ , ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో యూనివర్సిటీ ప్రతిష్ట మరింత మసకబారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్, యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్టర్ వ్యవహరిస్తున్న తీరు పై నివేదిక తెప్పించుకునే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.